Citizenship Bill: రాహుల్ ట్వీట్తో శివసేన మళ్లీ యూటర్న్, ఉద్దవ్ థాక్రే ఏమన్నారంటే..?
ముంబై: పౌరసత్వ సవరణ బిల్లును మొదట్నుంచి వ్యతిరేకించిన శివసేన.. సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టగానే ఆ బిల్లుకు మద్దతు తెలపడం కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలిన్లయింది. దీంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శివసేనపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శివసేన బిల్లుపై తమ మద్దతు నిర్ణయాన్ని సమీక్షించుకునే పనిలో పడింది.

క్లారిటీ ఇస్తేనే..
ఈ నేపథ్యంలోనే శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మంగళవారం మాట్లాడుతూ.. రాజ్యసభలో బిల్లుకు మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. ఆ బిల్లుపై తమకు కొన్ని సందేహాలున్నాయని ఆయన చెప్పారు. వాటిపై స్పష్టత వచ్చాకే బిల్లుకు మద్దతు విషయం గురించి ఆలోచిస్తామని అన్నారు.

మార్పులు చేయాల్సిందే..
విపక్షాలు చేసిన సూచనలకు అనుగుణంగా బిల్లులో మార్పులు చేయాల్సిందేనని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. లోక్సభలో ఓటేసినట్లుగా రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేయబోమని ఇప్పటికే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు.

రాహుల్ ట్వీట్ ఎఫెక్టే..
కాగా, పౌరసత్వ సవరణ బిల్లు భారత రాజ్యాంగంపై దాడి లాంటిదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ బిల్లుకు ఎవరైనా మద్దతిచ్చారంటే దానర్థం.. దేశ పునాదిపై దాడి చేసి నాశనం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లేని విమర్శించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు శివసేన మద్దతు తెలిపిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆ పార్టీని ఉద్దేశించి పరోక్ష ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శివసేన పౌరసత్వ బిల్లుకు మద్దతుపై పునరాలోచనలో పడింది.

కేంద్రం కసరత్తులకు చెక్ పెట్టేందుకు..
బిల్లుపై 12గంటలపాటు సుదీర్ఘ చర్చ అనంతరం లోక్సభ సోమవారం అర్ధరాత్రి ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లుకు శివసేన ఎంపీలు కూడా మద్దతు తెలిపారు. బుధవారం రాజ్యసభ ముందుకు ఈ పౌరసత్వ సవరణ బిల్లు రానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించేందుకు కసరత్తులు చేస్తుండగా.. విపక్షాలు మాత్రం బిల్లును వ్యతిరేకించేందుకు తమ మిత్రులను కలుపుకుపోతున్నాయి.












Click it and Unblock the Notifications