మోడీని అసభ్యంగా దూషించకూడదు, కాంగ్రెస్ లీడర్స్ కు రాహుల్ గాంధీ క్లాస్ !
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించేటప్పుడు అమర్యాదకరమైన పదాలు ఉపయోగించవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీని అమర్యాదగా విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీకే ఎక్కవ నష్టం అని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
మోడీ ఎవరో తెలుసు కదా !
గుజరాత్లోని డాకోర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అభిప్రాయాలను హుందాగా వెల్లడించాలని సూచించారు. ఆయన (నరేంద్ర మోడీ) మన ప్రధాని, అమర్యాదకరమైన పదాలు ఉపయోగించరాదని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేతలకు సున్నితంగా హెచ్చరించారు.
మోడీని పదవి నుంచి తప్పించండి !
మీరు కాంగ్రెస్ పార్టీలో నాయకులు, హుందాగానే ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించి ఆయన్ను పదవి నుంచి తప్పించాలని రాహుల్ గాంధీ సూచించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి విమర్శలు చేస్తూ నీచ్ (నీచుడు) అంటూ మణిశంకర్ అయ్యర్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు రాహుల్ గాంధీ ఈ సూచనలు చేయడం కొసమెరుపు.
గుజరాత్ నాశనం అయ్యింది!
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల గుజరాత్లో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని, దీనికి కేంద్రం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
గుడిలో రాహుల్, మోడీ జిందాబాద్ !
పేద ప్రజలు మూడు పూటల తినడానికి గుజరాత్ లో ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ఖేదా జిల్లా డాకోర్లోని ఆలయాన్నిసందర్శించిన రాహుల్ గాంధీ అనంతరం బయటికి వచ్చినప్పుడు అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
గుజరాత్ లో కాంగ్రెస్ దే అధికారం
గుజరాత్ లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని, అందులో ఎలాంటి సందేహం లేదని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. 22 ఏళ్ల బీజేపీ పాలనపై గుజరాత్ ప్రజలు విసిరిగిపోయారని, ఇప్పుడు ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.