అద్భుతం: 42 బోగీల రైలు.. ఆమెపై నుంచి వెళ్లినా.. ప్రాణాలతో..
పట్టాలు దాటుతున్న సమయంలో సడన్ గా రైలు వచ్చేయడంతో ఓ మహిళ తెలివిగా పట్టాల మధ్యలోనే కదలకుండా పడుకుని ప్రాణాలు దక్కించుకుంది. నమ్మకపోతే వీడియో చూడండి.
న్యూఢిల్లీ: సందడిగా ఉన్న రైల్వే స్టేషన్. పొడవాటి గూడ్సు రైలు ఒకటి రయ్యిన దూసుకుపోయింది. అది అటు వెళ్లిందో లేదో పట్టాల మధ్య నుంచి ఓ మహిళ పైకి లేచింది. మెల్లగా ప్లాట్ ఫామ్ పైకి ఎక్కింది.
ఈ దృశ్యం చూసి అక్కడున్న ప్రయాణికులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. మీద నుంచి రైలు పోయాక ఆమె బతికుండడం.. అసలు ఇదెలా జరిగింది? అంటూ కళ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయారు.
ఎప్పుడు, ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలియకపోయినా.. ఈ ఘటన మన దేశంలోనే ఏదో రైల్వేస్టేషన్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో యూట్యూబ్ లోకి అప్ లోడ్ చేశారు. ఫిబ్రవరి 21న యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియోలో మొదట రైలు వెళుతున్న దృశ్యం మాత్రమే కనిపిస్తుంది.
రైలు పూర్తిగా ప్లాట్ ఫామ్ దాటి వెళ్లిపోయాక అదే పట్టాలపై నుంచి ఈ మహిళ లేచి రావడం కనిపిస్తుంది. ఇది గమనించిన ప్లాట్ ఫామ్ పైనున్న ప్రయాణికుల్లో కొంతమంది ఆమెకు సాయం చేసేందుకు రావడం కనిపిస్తుంది.
పట్టాలు దాటుతున్న సమయంలో రైలు వచ్చేయడంతో ఆ మహిళ పట్టాల మధ్యలోనే కదలకుండా పడుకుని ఉండిపోవడం వల్ల ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా ఆపద సమయంలో ఆమె ఉపాయంతో వ్యవహరించిన తీరు, ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.