చేయని నేరానికి జైలుకు.. హైకోర్టు సంచలన తీర్పు..
కేరళలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చేయని నేరానికి ఓ వ్యక్తి 54 రోజులపాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ పరిణామాల కారణంగా అతడు ఉద్యోగం కోల్పోయి.. లైఫ్ చిన్నాభిన్నం అయింది. అయితే పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని గ్రహించిన హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. బాధితుడికి రూ.14లక్షలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో జరిగింది.
కేరళలోని ఎర్నాకుళంలో ఓ చోరీకి సంబంధించిన కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా.. ఆ వ్యక్తిపై అహం ప్రదర్శించిన నేపథ్యంలో కేరళ హైకోర్టు మండిపడింది. చేయని నేరానికి ఆ వ్యక్తి అనవసరంగా శిక్ష అనుభవించాడని.. తద్వారా అతని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని తెలిపింది. ఇందుకు పరిహారంగా బాధితుడికి రూ. 14 లక్షలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.
ఏం జరిగిందంటే..?
కేరళలోని కన్నూర్ జిల్లా తలస్పేరి ప్రాంతానికి చెందిన తాజూద్దీన్ ఖతార్ లో పనిచేసేవారు. అయితే 2018లో అతడు తన స్వస్థలానికి వచ్చాడు. అయితే ఓ రోజు రాత్రి తాజుద్దీన్ ఇంటి సమీపంలో పోలీసుల జీపు బురదలో కూరుకుపోయింది. సహాయం కోసం పోలీసులు అటుగా బండిపై వెళ్తున్న తాజూద్దీన్ ను అడిగారు. అయితే తాను అనారోగ్యంతో ఉన్నట్లు పోలీసులకు తాజూద్దీన్ తెలిపాడు. దాంతో పోలీసులు.. తాజూద్దీన్ బండి ఆపి అతడ్ని కిందకి దింపి బెదిరించారు.
అంతేకాక ఓ దొంగతనం కేసులో అతడ్ని అక్రమంగా ఇరికించారు. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అలా చేయని నేరానికి 54 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా తాజూద్దీన్ జైలులో గడిపాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. తిరిగి ఖతార్ వెళ్లిపోయాడు. అయితే ఇన్ని రోజులు చెప్పకుండా ఇంటి వద్ద ఉన్నందుకు అక్కడి కంపెనీ వాళ్లు తాజూద్దీన్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో స్వస్థలానికి వచ్చిన అతడు న్యాయపోరాటం చేశాడు.

ఈ క్రమంలోనే ఓ కేసులో అరెస్టైన నిందితుడు.. కన్నూర్ లో చోరీకి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కావాలనే అతడ్ని కేసులో ఇరికించినట్లు తేలడంతో హైకోర్టు మండిపడింది. బాధితుడికి రూ.14లక్షలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.












Click it and Unblock the Notifications