యాకూబ్ మెమెన్: ఉగ్రదాడి, టైట్ సెక్యూరిటి
ముంబై: 1993లో ముంబై నగరంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ఉరి శిక్షకు గురైన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమెన్ అలియాస్ యాకూబ్ మెమెన్ ఉంటున్న నాగ్ పూర్ సెంట్రల్ జైలు దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారులు జైలు దగ్గరే మకాం వేశారు.
ఉగ్రవాదులు పంజాబ్ లో దాడి చెయ్యడంతో భద్రత మరింత పెంచారు. ఈనెల 30వ తేదిన యాకూబ్ మెమెన్ కు ఉరి శిక్ష అమలు చెయ్యాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. యాకూబ్ మెమెన్ ను ఉరి తియ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదే సమయంలో పంజాబ్ లోని గురుదాస్ పూర్ దీనా నగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడులు చెయ్యడంతో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. యాకూబ్ మెమెన్ ను ఉరి తీస్తున్నారని ప్రతీకారంతో ఉగ్రవాదులు దాడులు చేశారా అని అధికారులు ఆరా తీస్తున్నారు.
ముందు జాగ్రత చర్యగా యాకూబ్ మెమెన్ ఉంటున్న నాగ్ పూర్ సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాలలో ఐదు అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. జైలులో ఉంటున్న నిందితులను కలవడానికి వస్తున్న వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. యాకూబ్ మెమెన్ ఉంటున్న బ్యారెక్ దగ్గర సాయుధ బలగాలు మోహరిస్తున్నాయి.