పశ్చిమ బెంగాల్ వార్ : ఊహించని ట్విస్ట్ , తృణమూల్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ తలపడుతున్నాయి. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి వలసలు కూడా కొనసాగుతున్నాయి. అయితే బిజెపికి గుడ్ బై చెప్పి టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి బీజేపీ నేత యశ్వంత్ సిన్హా.

వాజ్పేయి నేతృత్వంలో పని చేసిన కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు టీఎంసీలోకి జంప్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో పని చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు యశ్వంత్ సిన్హా ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. 83 ఏళ్ల మాజీ సీనియర్ బిజెపి నాయకుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీలో చేరడం రెండు పార్టీల్లోనూ వలసలకు అద్దం పడుతుంది.
యశ్వంత్ సిన్హా మొట్టమొదట 1990 నవంబరులో ఆర్థిక మంత్రిగా పదవిని చేపట్టారు జూన్ 1991 వరకు పదవిలో ఉన్నారు. ప్రధానమంత్రి చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఆయన పనిచేశారు.

బీజేపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పని చేసిన యశ్వంత్ సిన్హా
ఆ తర్వాత రెండవ పదవీకాలం డిసెంబర్ 1998 మరియు జూలై 2002 మధ్య ప్రధానమంత్రి వాజ్పేయి ఆధ్వర్యంలో పని చేశారు. అప్పటి నుండి మే 2004 వరకు ఆయన భారత విదేశాంగ మంత్రిగా కొనసాగారు. 1960 బ్యాచ్ మాజీ ఐఎఎస్ అధికారి అయిన మిస్టర్ యశ్వంత్ సిన్హా 1984 లో రాజకీయాల్లో చేరారు. ప్రభుత్వ సేవను విడిచిపెట్టి జనతా పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీలో చేరారు.అతని కుమారుడు జయంత్ సిన్హా బిజెపి సభ్యుడు మరియు హజారిబాగ్ (జార్ఖండ్) నుండి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.

మోడీ తీరుపై యశ్వంత్ సిన్హా అసహనం .. అందుకే బీజేపీకి గుడ్ బై
గత దశాబ్దంలో బిజెపిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి , యశ్వంత్ సిన్హా వంటి సీనియర్ నాయకులను పక్కన పెట్టి కొత్త తరానికి అవకాశాలు ఇచ్చారు . దీనితో ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రంగా విమర్శించిన ఆయన తరువాత పార్టీ నుంచి తప్పుకున్నారు.
బెంగాల్ ఎన్నికల సమయంలో తృణమూల్ లో కీలక నాయకులైన సువేందు అధికారి, రాజీబ్ బెనర్జీ బిజెపికి జంప్ అన్నారు . ఈ సమయంలో యశ్వంత్ సిన్హా పార్టీలోకి ప్రవేశించడం బెంగాల్ యొక్క అధికార పార్టీకి బలంగా మారింది .

యశ్వంత్ సిన్హా చేరికపై హర్షం వ్యక్తం చేసిన టీఎంసీ నేతలు
2018లోనే బీజేపీ కి గుడ్ బై చెప్పిన యశ్వంత్ సిన్హా
కోల్కతాలోని తృణమూల్ భవన్లో యశ్వంత్ సిన్హా డెరెక్ ఓ బ్రైన్, సుదీప్ బందోపాధ్యాయ, సుబ్రతా ముఖర్జీ సమక్షంలో సిన్హా తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక యశ్వంత్ సిన్హా చేరిక గురించి సుబ్రతా ముఖర్జీ మాట్లాడుతూ, యశ్వంత్ సిన్హా మాతో చేరడం మాకు గర్వంగా ఉందన్నారు . టిఎంసిలో చేరిన యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ, ఈ రోజు ఎక్కువగా అన్ని సంస్థలు బలహీనంగా ఉన్నాయి. దురదృష్టవశాత్తు, ఇందులో న్యాయవ్యవస్థ కూడా ఉంది. ప్రభుత్వ విచిత్రమైన ప్రవర్తనను ఆపడానికి ఎవరూ లేరు. దేశంలో ఏమి జరుగుతుందో చూస్తున్న ఎవరికి ఏ ఆందోళన లేదని పేర్కొన్నారు .

బీజేపీ సర్కార్ అణచివేతను నమ్ముకుందని మండిపడిన యశ్వంత్ సిన్హా
అటల్ బిహారీ వాజ్ పేయి ఏకాభిప్రాయాన్ని విశ్వసిస్తే, నేటి ప్రభుత్వం అణిచివేతపై విశ్వాసంతో ముందుకు సాగుతోంది అంటూ భారతీయ జనతా పార్టీని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుంది అన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
ఇది బెంగాల్ ఎన్నికల సమయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ .












Click it and Unblock the Notifications