పశ్చిమ బెంగాల్ వార్ .. టీఎంసీ ఉపాధ్యక్షుడిగా యశ్వంత్ సిన్హాకు చోటు , వర్కింగ్ కమిటీలోనూ స్థానం
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ,
కేంద్ర మాజీ మంత్రి గా, బిజెపిలో సీనియర్ నాయకుడిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రెండు రోజులలోనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆయనకు కీలక పదవి కట్టబెట్టారు. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సోమవారం పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. వర్కింగ్ కమిటీలో కూడా యశ్వంత్ సిన్హా కీలకంగా వ్యవహరించనున్నారు.

టీఎంసీ విజయం కోసం రంగంలోకి యశ్వంత్ సిన్హా
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న సిన్హా శనివారం టిఎంసిలో చేరారు.
టిఎంసి భవన్లో విలేకరుల సమావేశంలో సిన్హా మాట్లాడుతూ, "ఈ ప్రభుత్వం (బిజెపి) ఎన్నికల్లో విజయం సాధించడానికి ఏదైనా చేయగలదు. మమతా బెనర్జీపై దాడి ఆ కోవలోనే జరిగిందని పేర్కొన్నారు. తాను మమతా బెనర్జీ తో కలిసి పనిచేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ఈ ఎన్నికల్లో టిఎంసి భారీ మెజారిటీతో గెలిచేలా చూడాల్సిన అవసరం ఉందని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు .

ఈ వయసులో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చినకారణం చెప్పిన యశ్వంత్ సిన్హా
ఈ వయసులో తనకు రాజకీయాలు ఎందుకని , ఎందుకు తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరి చురుగ్గా మారుతున్నానో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు యశ్వంత్ సిన్హా. దేశం అసాధారణమైన పరిస్థితిని ఎదుర్కుంటుంది అని పేర్కొన్నారు. ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడిందని , ప్రజా స్వామ్య వ్యవస్థ బలహీనం అయిందని , అన్ని వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయని, అందులో న్యాయవ్యవస్థ కూడా ఉండడం శోచనీయం అని ఆయన పేర్కొన్నారు.

మమత ధైర్య శాలి అని గతంలో సంఘటన చెప్పిన యశ్వంత్ సిన్హా
ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో తన వంటి నేతల అవసరం ఉందని భావించి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చానని చెప్పారు యశ్వంత్ సిన్హా . ఇదే సమయంలో మమతా బెనర్జీ ధైర్యాన్ని, గతంలో ఆమెతో పనిచేసిన అనుభవాలను గురించి యశ్వంత్ సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో మమతా బెనర్జీతో కలిసి పని చేశానని , మొదటి నుండి మమతా బెనర్జీ పోరాటం చేస్తూనే ఉన్నారని, గతంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్ళినప్పుడు ప్రయాణికులను కాపాడటానికి మమతా బెనర్జీ బందీగా వెళ్ళటానికి సిద్ధపడ్డారని ,ఆమె అంతటి ధైర్య శాలి అని చెప్పారు యశ్వంత్ సిన్హా.












Click it and Unblock the Notifications