టెర్రర్ ఫండింగ్ కేసులో యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు: ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇదే
న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం టెర్రర్ ఫండింగ్ కేసులో దోషిగా తేలిన కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్కు ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు బుధవారం శిక్షను ప్రకటించింది. మాలిక్కు జీవిత ఖైదు విధించింది కోర్టు.
కోర్ట్రూమ్లో హాజరుపరిచిన తర్వాత, మాలిక్ అసౌకర్యంగా ఉన్నారని పేర్కొంటూ కుర్చీ కోసం అభ్యర్థించాడు. శిక్షా పత్రాలను ముద్రించడం, తిరిగి ధృవీకరించడం వల్ల శిక్షా పరిమాణాన్ని ప్రకటించడం గంటల తరబడి ఆలస్యం అయింది.
గత విచారణ సందర్భంగా మాలిక్ తన న్యాయవాదిని ఉపసంహరించుకున్నారు. ఉగ్రవాద నిధుల కేసులో కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)తో సహా అన్ని నేరాల ఆరోపణలను మాలిక్ అంగీకరించాడు.
ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ మే 19న మాలిక్ను దోషిగా నిర్ధారించారు.అతని ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి అతనిపై విధించే జరిమానా మొత్తాన్ని నిర్ణయించాలని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులను ఆదేశించారు. నేరపూరిత కుట్ర, దేశంపై యుద్ధం చేయడం, ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, కాశ్మీర్లో శాంతికి భంగం కలిగించడం వంటి అభియోగాలు యాసిన్ మాలిక్పై ఉన్నాయి.
అయితే, శిక్ష విషయంలో మాలిక్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. 'నేను ఏమీ అడగను. అంతిమ నిర్ణయం న్యాయస్థానానిదే. నేను ఏడుగురు ప్రధాన మంత్రులతో పనిచేశాను. గత 28 ఏళ్లలో తాను హింసకు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను' అని మాలిక్ చెప్పాడు. ఉరిశిక్ష వేసినా సమ్మతమే అని యాసిన్ తరఫున కోర్టుకు నివేదించారు అతడి న్యాయవాది.
జమ్మూకాశ్మీర్లో హైఅలర్ట్
యాసిన్ మాలిక్కు శిక్ష ఖరారు నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లో హైఅలెర్ట్ ప్రకటించారు. శ్రీనగర్లోని లాల్చౌక్ ప్రాంతంలో బంద్ వాతావరణం నెలకొంది. ఓల్డ్ సిటీలో ప్రజారవాణా సైతం నామమాత్రంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.భారీగా పోలీసు, జవాన్లు బందోబస్తు నిర్వహిస్తున్నారు.