యాసిన్ మాలిక్ నేతృత్వంలో నడిచే ఈ సంస్థపై నిషేధం విధించిన కేంద్రం
వేర్పాటు వాది యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ను కేంద్రం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జమ్మూకశ్మీర్లో శాంతికి విఘాతం కలిగించేలా ఈ సంస్థ వ్యవహరిస్తోందని పేర్కొంటూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని పేర్కొంటూ ఆ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ తెలిపారు. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు చెప్పారు.
ఇక జమ్మూ కశ్మీర్లో యాసిన్ మాలిక్ సంస్థ శాంతి భధ్రతలకు విఘాతం కల్పించేలా వ్యవహరిస్తోందన్నారు రాజీవ్. ఇక్కడ యువతను రెచ్చగొడుతూ వారిని హింసవైపునకు మరలుస్తోందని అన్నారు రాజీవ్. జమ్మూ కశ్మీర్లో అలజడి సృష్టించి దేశ సమగ్రతను దెబ్బ తీసేలా సంస్థ వ్యవహరిస్తోందని అందుకే నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆ సంస్థ నాయకుడు యాసిన్ మాలిక్ను ముందస్తుగా అరెస్టు చేసి జమ్మూలోని కోట్ బాల్వాల్ జైలుకు తరలించారు పోలీసులు.
మసూద్ అజార్పై ఆంక్షలు విధించండి...ఐరోపా సమాఖ్యను ఆశ్రయించిన ఫ్రాన్స్
ఇక జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులకు ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని రాజీవ్ గౌబ తెలిపారు.అంతేకాదు ఉగ్రవాదాన్ని కూడా పెంచి పోషిస్తోందని ఆయన చెప్పారు. ఈ నెలలో జమాత్ ఈ ఇస్లామి జమ్ము కశ్మీర్ సంస్థ పై నిషేధం విధించిన కేంద్రం ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.