యే దిల్ మాంగే మోర్: మోడీ, పిల్లాడివి కాదు: ప్రియాంక
చండీగఢ్/అమేథీ: 'యే దిల్ మాంగే 300 లోటస్' అంటూ గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్ సభలో అన్నారు. తన మనసు మూడువందల లోకసభ సీట్లు కోరుకుంటోందన్నారు. బిజెపి ఎన్నికల గుర్తు కమలం పువ్వు. దీంతో ఆయన తన మనసు మూడువందల లోటస్లను కోరుతోందని తనదైన శైలిలో చెప్పారు.
ప్రజాసేవ చేయడానికి తన మనసు అరవై నెలల సమయం కోరుకుంటోందన్నారు. ప్రజాసేవ చేయడానికి మీ ఆశీర్వాదం కావాలని, రానున్న ఎన్నికల్లో శాసించే వారిని కాకుండా, సేవ చేసే వారిని ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు.
భూకంపంతో గుజరాతీలు సర్వం కోల్పోయినప్పుడు... ఈ దేవభూమి ఆశీర్వాదంతో, తపనతో గుజరాత్ను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. కాగా, తన అరగంట ప్రసంగంలో.. మోడ మూడుసార్లు యె దిల్ మాంగే మోర్ అంటూ వ్యాఖ్యానించారు.
పిల్లాడి మాటలొద్దు: ప్రియాంక
మోడీపై కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అమేథీలో ఓ ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ... మోడీవి చిన్న పిల్లల మాటలన్నారు.
మోడీ ప్రధాని పదవికి పోటీ పడుతున్నారని, అందుకు తగినట్లుగా మాట్లాడాలని, పిల్ల మాటలు మానుకోవాలన్నారు. తన తండ్రి కంప్యూటర్ ప్రవేశపెట్టినప్పుడు కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారన్నారు. నాటి ఆయన స్వప్నమే ఇప్పడు సాకారమై దేశాన్ని అగ్రదేశాల సరసన చేర్చింద్నారు. ఇప్పుడు రాహుల్ కూడా సుదీర్ఘ, భవిష్యత్ ప్రణాళికలు రచిస్తుంటే విమర్శలు వినిపిస్తున్నాయన్నారు.