తాజ్ మహల్: యోగి ప్రభుత్వం వివాదాస్పద బుక్లెట్, ఇదీ జరిగింది
ప్రపంచ ఏడు వింతలలో ఒకటైనా తాజ్ మహల్ పర్యాటక ప్రాంతం కాదా? అంటే అవునంటోంది ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ!
లక్నో: ప్రపంచ ఏడు వింతలలో ఒకటైనా తాజ్ మహల్ పర్యాటక ప్రాంతం కాదా? అంటే అవునంటోంది ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ!
యూపీ పర్యాటక శాఖ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, ప్రోత్సాహానికి విడుదల చేసిన బుక్లెట్లో తాజ్ మహల్ పేరును తొలగించింది.
యూపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఈ పర్యటక ప్రదేశాల జాబితాలో తాజ్ మహల్ కట్టడం లేకపోవడం వివాదానికి కారణమైంది. దీంతో ప్రతిపక్షాలు యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మత ప్రాతిపదికన తాజ్మహల్ను ప్రభుత్వం చూస్తోందంటూ విమర్శలు గుప్పించారు.
ఎక్కడో పొరపాటు జరిగిందని పర్యాటక శాఖ అధికారులు
అయితే ఎక్కడో పొరపాటు జరిగిందని అటు ప్రభుత్వం, ఇటు పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని సందర్శనీయ ప్రదేశాలతో కూడిన బుక్లెట్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గమైన గోరఖ్పూర్కు చెందిన ఆలయం కూడా ఉంది. కానీ ఆగ్రాలోని తాజ్మహల్ ప్రస్తావన అందులో లేదు. ఇది వివాదానికి కారణమైంది.
ముస్లీంల కట్టడంగా చూస్తూ పక్కన పెట్టారని ఆరోపణ
దీనిపై ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) విమర్శలు గుప్పించింది. ముస్లింలకు చెందిన కట్టడంగా చూస్తూ తాజ్మహల్ను పక్కనపెట్టడం బిజెపి ఆలోచనా విధానానికి నిదర్శనమంటూ ఆ పార్టీ నేత రాజేంద్ర చౌధరి తప్పబట్టారు. దాన్ని ఒక చారిత్రక కట్టడంగా మాత్రమే చూడాలన్నారు.
ఎక్కడో పొరపాటు అని మంత్రి
ఈ వివాదంపై రాష్ట్ర మంత్రి సిద్ధార్థ్నాథ్ సింగ్ స్పందించారు. ఎక్కడో పొరపాటు జరిగిందన్నారు. తాజ్మహల్ విశిష్ఠతను తమ ప్రభుత్వం ఎప్పుడో గుర్తించిందని, త్వరలో ఆగ్రాలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నామన్నారు.
ఇదీ జరిగింది
దీనిపై పర్యటక శాఖ అధికారులు స్పందిస్తూ తాజ్మహల్ను విస్మరించలేదని, విడుదల చేసిన బుక్లెట్ కేవలం మీడియా సమావేశానికి మాత్రమే ఉద్దేశించిందని చెప్పారు. పూర్తిస్థాయి సందర్శనా స్థలాలను తెలిపే గైడ్ కాదన్నారు.