యోగికి సీఎం అవుతానని ముందే తెలుసా?: అప్పుడు చెప్పిందే ఇప్పుడిలా!
'చల్తే చల్తే' అనే ఓ టీవి కార్యక్రమంలో యోగి ఇచ్చిన ఇంటర్వ్యూను పరిశీలిస్తే.. సీఎం అవుతానన్న ధీమా ఆయనలో ముందునుంచి ఉన్నట్లు తెలుస్తోంది.
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎంగా కొలువుదీరిన యోగి ఆదిత్యనాథ్ కు తాను సీఎం అవుతానన్న విషయం ముందే తెలుసా? గతంలో 'చల్తే చల్తే' అనే ఓ టీవి కార్యక్రమంలో యోగి ఇచ్చిన ఇంటర్వ్యూను పరిశీలిస్తే.. సీఎం అవుతానన్న ధీమా ఆయనలో ముందునుంచి ఉన్నట్లు తెలుస్తోంది.
యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యోగి ఏ ఆదేశాలైతే ఇచ్చారో.. దానికి సంబంధించిన కార్యాచరణను ఆయన గత ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని కబేళాలను మూసివేస్తామని అప్పటి ఇంటర్వ్యూలో చెప్పారు. దాంతో పాటు యాంటీ రోమియో దళాలను ఏర్పాటు చేస్తామన్నారు. చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే సీఎం యోగి వీటి అమలుతోనే తన కార్యాచరణను మొదలుపెట్టారు.
ఇకపోతే గతంలో ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో యోగి పలు వివాదస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. యూపీలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్ పూర్ లో మాత్రమే ముస్లింల జనాభాను పెరగకుండా నియంత్రించగలిగామని అన్నారు. యూపీలో అధికారంలో లేకపోయినా గోరఖ్ పూర్ లో ముస్లింల జనాభాను నియంత్రించడంలో తాము సఫలమయ్యామని, అలాంటిది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఆ పని ఎందుకు చేయలేకపోయిందని యోగి అప్పట్లో ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్ లో క్రైస్తవుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని యోగి ఆందోళన వ్యక్తం చేశారు. విలాస జీవితాలను ఎరచూపి క్రైస్తవ మహిళను పెళ్లి చేసుకునేందుకు హిందు యువకులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన అన్నారు. క్రైస్తవుల సంఖ్యను నియంత్రించేందుకు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు.