యూపీ బాలికలకు యోగీ గుడ్ న్యూస్-15 వేల నుంచి 25 వేలకు పెంచేస్తూ..
యూపీలో బాలికలకు ఎన్నికల వేళ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గుడ్ న్యూస్ చెప్పారు.ఇప్పటికే మహిళలు, బాలికల విషయంలో ప్రత్యేక శ్రద్ధతో పథకాలు అమలు చేస్తున్న యోగీ.. తాజాగా మరో శుభవార్త అందించారు. ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన కింద బాలికలకు ఇస్తున్న రూ.15 వేల మొత్తాన్ని ఇప్పుడు రూ.25 వేలకు పెంచుతూ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాఖీ పండుగ కానుకగా ఈ నిర్ణయం ప్రకటించారు.
యూపీలో ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన కింద బాలికలకు ఆరు దశల్లో రూ.15 వేల రూపాయలు అందిస్తున్నారు. దీన్ని ఇప్పుడు రూ.25 వేలకు పెంచాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ నిర్ణయించారు. అయితే ఈ పెంపు వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అమలుచేయబోతున్నట్లు తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరం మధ్యలో ఉన్నందున ప్రస్తుతానికి రూ.15 వేల రూపాయలు మాత్రమే అందించనున్నారు. బాలికలు పుట్టినప్పటి నుంచి వారు పెరిగి, చదువుకునే వరకూ ఆరు దశల్లో ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన పథకం అమలవుతోంది.

వచ్చే సంవత్సరం నుండి బాలిక పుట్టిన వెంటనే ఆమె తల్లిదండ్రుల ఖాతాకు రూ. 5,000 బదిలీ చేస్తారు. ఆమెకు ఒక సంవత్సరం నిండినప్పుడు రూ.2,000 బదిలీ చేస్తారు. ఆమె మొదటి తరగతిలో ప్రవేశించినప్పుడు రూ.3,000, ఆరో తరగతిలో ప్రవేశిస్తే రూ.3,000, తొమ్మిదో తరగతిలో ప్రవేశిస్తే రూ.5,000 ఇస్తారు. అలాగే ఆమె గ్రాడ్యుయేట్, డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సును అభ్యసిస్తే రూ.7,000 మొత్తం ఆమె ఖాతాకు బదిలీ చేయబోతున్నట్లు యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు.
ఈ పథకంలో కొందరు లబ్ధిదారులు ముఖ్యమంత్రి యోగీకి రాఖీ కట్టి ఆయన నుదుటిపై సంప్రదాయ తిలకం దిద్దారు. ప్రతిఫలంగా యోగీ వారికి బహుమతులు అందించారు. వారికి నిరంతరం రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 29,523 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.5.82 కోట్లను ఈ ఏడాది పథకం లబ్ది కింద ముఖ్యమంత్రి యోగీ బదిలీ చేశారు. 10 మంది లబ్ది పొందిన బాలికలు, వారి తల్లిదండ్రులకు చెక్కులను కూడా ఆయన పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications