ఈ రికార్డ్ నా సొంతం, అంచనాలు తలకిందులు: మోడీ
వడోదర: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల పైన వడోదరలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వడోదరలో తనకు వచ్చిన మెజార్టీ దేశంలో ఎవరికీ రాలేదన్నారు. 5.70 లక్షల మెజార్టీ.. ఈ రికార్డ్ తన సొంతమని చెప్పారు.
వడోదర సభలో మోడీ మాట్లాడుతున్నంత సేపు సభా ప్రాంగణం మోడీ...మోడీ.. అంటూ హోరెత్తింది. మోడీ ప్రసంగానికి జనం జేజేలు కొట్టారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... దేశానికి ఇది శుభదినమన్నారు. వడోదరను దేశంలోనే అభివృద్ధి చెందిన నగరంగా తీర్చి దిద్దుతానని చెప్పారు. తాను ఎక్కడున్న మీకోసం పని చేస్తానని చెప్పారు. బిజెపిని గెలిపించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రజాస్వామ్యానిది, ప్రజలది అన్నారు.
వడోదర ప్రజలకు తాను తలవంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. విజయం కోసం కృషి చేసిన ఎన్డీయే పక్షాలందరికీ తాను కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఇంతకాలం సంకీర్ణ ప్రభుత్వాలు దేశాన్ని పాలించాయన్నారు.
కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు బిజెపికి సంపూర్ణ మెజార్టీ ఇచ్చారన్నారు. రాజకీయ పండితుల అంచనాలు అన్నీ తలకిందులయ్యాయన్నారు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారి స్వతంత్రంగా అధికారం దక్కించుకున్న కాంగ్రెస్సేతర పార్టీ బిజెపియే అన్నారు. ప్రభుత్వాలు ఏ కొందరి కోసమే కాకుండా ప్రజలందరి కోసం పని చేయాలన్నారు.
ప్రజల్లో విశ్వాసం నింపడంలో బిజెపి విజయం సాధించిందన్నారు. దేశం కోసం జైలుకు వెళ్లేందుకు లేదా ప్రాణత్యాగం చేసేందుకు అవకాశం రాకపోయినప్పటికీ.. సురాజ్యం కోసం ముందుకు సాగుదామన్నారు. స్వాతంత్రం వచ్చిన తరవాత జన్మించిన వ్యక్తి తొలిసారి ప్రధాని కాబోతున్నారన్నారు.