నీపై క్రిమినల్ డిఫమేషన్ తప్పదు, గౌహతిలో చూస్తా: సిసోడియా ఆరోపణలపై సీఎం హిమంత ఘాటుగా
న్యూఢిల్లీ/గౌహతి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేసిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను క్రిమినల్ పరువునష్టం దావాను ఎదుర్కొవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పీపీఈ కిట్ల సరఫరాలో హిమంత కుటుంబం అవకతవకలకు పాల్పడిందంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన ఆరోపణలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం మండిపడ్డారు. సిసోడియా ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
నా భార్య 1500 పీపీఈ కిట్లు ఉచితంగా ఇచ్చింది: సీఎం హిమంత
ట్విటర్ వేదికగా హిమంత బిశ్వశర్మ స్పందిస్తూ.. "దేశం మొత్తం 100 ఏళ్లలో అత్యంత ఘోరమైన మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయంలో.. అస్సాంలో ఎటువంటి PPE కిట్లు లేవు. ప్రాణాలను కాపాడేందుకు నా భార్య ధైర్యంగా ముందుకు వచ్చి సుమారు 1500 పీపీఈ కిట్లను ప్రభుత్వానికి ఉచితంగా అందించింది. ఆమె ఒక్క పైసా కూడా తీసుకోలేదు' అని తెలిపారు.
క్రిమినల్ డిఫమేషన్ తప్పదు: సిసోడియాకు సీఎం హిమంత వార్నింగ్
'ఆ(కరోనా) సమయంలో మిస్టర్ మనీష్ సిసోడియా పూర్తిగా భిన్నమైన కోణాన్ని చూపించారు. ఢిల్లీలో చిక్కుకుపోయిన అస్సామీ ప్రజలకు సహాయం చేయడం కోసం.. నేను మీకు పలుమార్లు కాల్ చేసినా.. మీరు తిరస్కరించారు. ఢిల్లీ మార్చురీ నుంచి అస్సామీ కోవిడ్ బాధితుడి మృతదేహాన్ని తీసుకురావడానికి నేను 7 రోజులు వేచి ఉండాల్సిన ఒక సందర్భాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను' అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత గుర్తు చేసుకున్నారు. 'ప్రబోధించడం ఆపివేయండి, మీరు నేరపూరిత పరువు నష్టం దావాను ఎదుర్కొంటారు కాబట్టి నేను మిమ్మల్ని త్వరలో గౌహతిలో కలుస్తాను' అంటూ హెచ్చరించారు.
పీపీఈ కిట్లలో అవినీతికి పాల్పడ్డారంటూ హిమంత కుటుంబంపై సిసోడియా
మీడియా నివేదికలను ఉటంకిస్తూ.. ఆమ్ ఆద్మీపార్టీ నాయకుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం మాట్లాడుతూ.. 2020లో అస్సాం ఆరోగ్య మంత్రిగా ఉన్న హిమంత బిశ్వవా శర్మ.. మార్కెట్ ధరలకు మించి పీపీఈ కిట్లను సరఫరా చేయడానికి తన భార్యకు సంబంధించిన కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ.. అస్సాం ప్రభుత్వం పీపీఈ కిట్లను ఇతర కంపెనీల నుంచి 600 రూపాయలకు కొనుగోలు చేసిందని, హిమంత భార్య, కుమారుడి వ్యాపార భాగస్వాముల కంపెనీలకు 990 రూపాయలకు అత్యవసర సరఫరా ఆర్డర్లు ఇచ్చిందని, అందువల్ల "కోవిడ్-19 ఎమర్జెన్సీ ప్రయోజనం తీసుకోవడం" జరిగిందని సిసోడియా ఆరోపించారు. 'కంపెనీ పీపీఈ కిట్లను సరఫరా చేయలేకపోవడంతో శర్మ భార్య సంస్థకు ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేయబడింది, అతని కొడుకు వ్యాపార భాగస్వాములకు చెందిన సంస్థకు కిట్కు రూ. 1,680 చొప్పున మరో సరఫరా ఆర్డర్ను అందించింది' అని సిసోడియా అన్నారు. 'వారు అవినీతి గురించి మాట్లాడతారు, ప్రతిపక్ష పార్టీల సభ్యులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అవినీతిపై వారి అవగాహనపై నేను విచారణ చేయాలనుకుంటున్నాను.. ఈ (అస్సాం కేసు) అవినీతిని వారు పరిగణనలోకి తీసుకుంటారా? లేదా అని వారిని అడగాలనుకుంటున్నాను' అని సిసోడియా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సిసోడియా ఆరోపణలకు సీఎం హిమంత కౌంటర్ ఇచ్చారు.