‘పెద్దల’ అరాచకం: ప్రేమ పెళ్లి చేసుకున్నారని కొట్టి చంపించారు
బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు పొరుగింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంగా.. గ్రామపెద్దలే అతనికి మరణశిక్ష విధించారు.
పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు పొరుగింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంగా.. గ్రామపెద్దలే అతనికి మరణశిక్ష విధించారు. గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారో లేదో వెంటనే అమ్మాయి కుటుంబీకులు క్షణాల్లో యువకుడిని అతడి ఇంట్లోంచి లాక్కెళ్లి దారుణంగా కొట్టి, తుపాకీతో కాల్చి చంపేశారు. భగల్పూర్ జిల్లా గౌరచక్కి గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

చిన్ననాటి ప్రేమ
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. హిమాన్షు యాదవ్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన పొరుగింటి యువతి ప్రేమించుకున్నారు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ స్నేహంగా పెరగడంతో అబ్బాయి కుటుంబీకులు ఒప్పుకున్నప్పటికీ.. అమ్మాయి తరపు కుటుంబం వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే ఇటీవల వీరద్దరూ వివాహం చేసుకోవడంతో దీనిపై మంగళవారం పంచాయితీ జరిగింది.

పెద్దల అరాచకం
ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లిని రద్దుచేసిన గ్రామపెద్దలు.. హిమాన్షు యాదవ్ను చంపేయాలంటూ అమ్మాయి తరపు కుటుంబాన్ని ఆదేశించారు. వారి నోట నుంచి ఆ మాట వచ్చిన వెంటనే వధువు కుటుంబీకులు సరాసరిన పెళ్లికొడుకును ఇంట్లోంచి లాక్కొచ్చి కాళ్లు చేతులు విరిగేలా చావకొట్టారు.

చంపేశారు..
హిాన్షు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత కూడా అతడి శరీరంలోకి ఆరు సార్లు కాల్పులు జరిపారని వరుడి తల్లి రోదిస్తూ చెప్పింది. ఇంత ఘోరం జరుగుతున్న గ్రామంలో ఎవరూ అడ్డుకోకపోవడం, పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం విచారకరం.

శోచనీయం..
పోలీసులు, కోర్టులున్నా.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుండటం శోచనీయం. కాగా, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రత్యేక పోలీసు బృందాలు విచారణ మొదలు పెట్టాయని, తానే స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్టు భగల్పూర్ ఎస్ఎస్పీ మనోజ్ కుమార్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications