తండ్రిని చంపి... 25 ముక్కలుగా నరికి...
ఢిల్లీ : మానవత్వం మంటగలుస్తోంది. బంధాలు, అనుబంధాలకు విలువే లేకుండా పోతోంది. జులాయిగా తిరుగుతూ ఆస్తి కోసం గొడవపడుతున్న కొడుకును మందలించిన పాపానికి ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. కన్న కొడుకు చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
తండ్రిని చంపిన కొడుకు
ఢిల్లీకి చెందిన సందేశ్ కాస్మోటిక్స్ బిజినెస్ చేసేవాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. పెద్ద కొడుకు అమన్కు సందేశ్కు మధ్య ఆస్తికి సంబంధించి తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మంగళవారం కూడా ఇద్దరి వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన అమన్.. తండ్రిని నరికి చంపాడు.
మృతదేహాన్ని 25ముక్కలు చేసి
తండ్రి మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నంలో భాగంగా అమన్ డెడ్ బాడీని 25 ముక్కలు చేశాడు. శరీర భాగాలను నాలుగు బ్యాగుల్లో నింపి నలుగురు స్నేహితుల సాయంతో ఎక్కడైనా పడేసేందుకు స్కెచ్ వేశాడు. అయితే పాపం పండటంతో చివరి నిమిషంలో పోలీసులకు చిక్కాడు. హత్యకు సంబంధించిన పక్కా సమాచారంలో సందీప్ ఇంటికి చేరుకున్న పోలీసులు ముక్కలుగా చేసిన శరీర భాగాలను స్వాధీన పరుచుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ముగ్గురు పారిపోయారు. అమన్తో పాటు అతని స్నేహితున్ని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మాటిమాటికి తిడుతున్నందునే చంపేశానని అమన్ పోలీసు విచారణలో చెప్పాడు
భార్య, మిగతా పిల్లల హస్తం?
సందేశ్ కుమార్ హత్య ప్రీ ప్లాన్డ్గా జరిగిందని ఆయన సోదరుడు సందీప్ ఆరోపించారు. ఈ మర్డర్ వెనుక మృతుడి భార్య, మరో కొడుకు, కూతురు హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం అమన్ సందేశ్ను చంపుతానని బెదిరించిన విషయాన్ని పోలీసుల దృష్టికి తెచ్చాడు. ఆస్తి కోసం భార్య, కుమారులు తన సోదరున్ని వేధించేవారని, దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. సందేశ్ హత్య జరిగిన రోజున అతని భార్య ప్లాన్ ప్రకారం కొడుకు, కూతురిని తీసుకుని బయటకు వెళ్లిందని సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.