మహిళ ప్రాణాలు పోతుంటే.. మొబైల్ ఫోన్లో వీడియో తీశారు
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలోని ముత్తంబలంలో మానవత్వం మరచిన ఇద్దరు యువకుల వల్ల ఓ మహిళ తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. రైలు వస్తుండగా పట్టాలపై సృహతప్పి పడిపోయిన మహిళలను కాపాడాల్సిన ఇద్దరు యువకులు.. ప్రమాద దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించడానికి పరిమితమయ్యారు. దీంతో ఆమె తన ప్రాణాలను కోల్పోయింది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లైలా థన్కచన్(47) అనే మహిళ రైలుపట్టాలు దాటుతుండగా సృహతప్పి పడిపోయింది. రైల్వే గేటు కాపలాదారు గమనించి ఎర్రజెండాను వూపాడు. అయితే వేగంగా వస్తున్న రైలు ఆ మహిళలను ఢీకొట్టిన తర్వాత కొంతదూరంలో ఆగిపోయింది.

ఆమె పట్టాలపై పడిపోయినప్పుడు దగ్గరగా ఇద్దరు యువకులు ఉన్నారని.. రక్షించడానికి అవకాశం ఉన్నా.. మొబైల్తో ప్రమాద దృశ్యాలను చిత్రీకరించడానికే వారిద్దరు పరిమితమయ్యారని కాపలాదారు పేర్కొన్నారు. వాళ్లు స్పందించివుంటే ఆమె ప్రాణాలతో బయటపడేదని తెలిపాడు.
ఇది ఇలా ఉండగా, కోజికోడ్లో బుధవారం జరిగిన మరో ఘటనలో పట్టాలపై నడుస్తున్న వ్యక్తిని కాపాడబోయి ఓ వృద్ధుడు ప్రాణాలు వదిలాడు. రైలు వస్తున్న పట్టాలపై రమణ్(70) అనే వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. గమనించిన మరో వ్యక్తి (64) ఆయన్ని కాపాడేందుకు ప్రయత్నించగా రైలు ఢీకొని ఇద్దరూ ప్రాణాలు వదిలారు.












Click it and Unblock the Notifications