ప్రియురాళ్ల సంతోషం కోసం దోపిడీలకు తెగబడ్డాడు
నాగపూర్: ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు యువతులతో ప్రేమాయణం సాగించాడో ప్రబుద్దుడు. ఆ ఏడుగురు ప్రియురాళ్లను సంతోష పెట్టడం కోసం దోపిడీలు, దొంగతనాలకు తెగబడ్డాడు. ఈ విషయం పోలీసులకు పట్టబుడిన ఆ యువకుడు చెప్పడటంతో వారు నివ్వెరపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మహారాష్ట్రలోని బల్దాన జిల్లాకి చెందిన పోలీసులు ఓం ప్రకాశ్ రంగనాథ్ ఖండారే(26)ని అరెస్టు చేశారు. తొమ్మిది దోపిడీ కేసుల్లో అతడు ప్రధాన నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓంప్రకాశ్పై పలు ప్రాంతాల్లో దొంగతనాలు, దోపిడీ కేసులు నమోదయ్యాయి.
మద్యానికి బానిసై విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఓం ప్రకాశ్ ఈ దొంగతనాలకు పాల్పడ్డాడు. అదుపులోకి తీసుకున్న అతడి దగ్గర నుంచి 17 మొబైల్ ఫోన్లు, రూ.4.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని విచారించిన పోలీసులు ఓం ప్రకాశ్ చెప్పిన సమాధానానికి కంగుతిన్నారు.
తనకున్న ఏడుగురు గర్ల్ఫ్రెండ్స్ను సంతోషపెట్టడానికి దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పాడు. నిందితుడిపై ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోని పలు నగరాల్లో కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
ఓంప్రకాశ్ వద్దనుంచి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఏసీ కంపార్ట్మెంట్లలో ప్రయాణించి అనేకమంది ప్రయాణికుల వద్ద కూడా ఓంప్రకాశ్ దోపీడీలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.