బోర్డు పరీక్షలు వద్దు.. ప్రాణాలతో చలగాటమా, సీఎం జగన్కు రఘురామ లేఖ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో లేఖ రాశారు. పరీక్షలు నిర్వహించొద్దని ఇదివరకే సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. బోర్డు పరీక్షల రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, పరీక్షలు రద్దు చేయాలని లేఖలో కోరారు. పట్టుదల, పంతాలు, పట్టింపులు పక్కనపెట్టి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని కోరారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చిత్తశుద్ధిని సుప్రీంకోర్టు శంకించిందని, ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలని కోరారు.

డెల్టా ముప్పు..
ఏపీ సర్కార్ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అనుమానాలు లేవనెత్తిందని చెప్పారు. కరోనా వైరస్ వల్ల అనిశ్చితి వాతావరణం కొనసాగుతున్న తరుణంలో పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపటం బాధాకరమైన విషయమన్నారు. ఇటు డెల్టా వేరియంట్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న
సంగతి తెలిసిందే.

ప్రాణాలతో చెలగాటమే..
పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం చెప్పడం శోచనీయం అని రఘురామ అన్నారు. పరీక్షలను నిర్వహించడం అంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుందన్నారు. పక్కా ప్రణాళిక లేకుండా మొండితనంతో పరీక్షలు నిర్వహించాలని అనుకోవడం మంచిది కాదని సూచించారు. పరీక్షలు నిర్వహిస్తే.. జరగరాని నష్టం జరిగితే .. సరిదిద్దుకోలేని తప్పు అవుతుందన్నారు. సుప్రీం కోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని.. పరీక్షల నిర్వహణపై విజ్ఞతతో గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని రఘురామ ఆ లేఖలో పేర్కొన్నారు.

లేఖల పరంపరం
మరోవైపు నిన్న వైఎస్ఆర్ సీపీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని గతంలోనే వైసీపీ ఎంపీలు ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని వారు మరోసారి లేఖలో ప్రస్తావించారు. రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని గత ఏడాది జులై 3న ఫిర్యాదు చేశామని... జాప్యం చేస్తున్నారని లేఖలో వారు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications