Zee News-BARC ఎగ్జిట్ పోల్స్: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోనూ కమలం హవా
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగియడంతో ఆ రాష్ట్రంతోపాటు హిమాచల్ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదలు చేస్తున్నాయి మీడియా ఛానళ్లు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా తిరిగి భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని నిలుపుకుంటుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
తాజాగా, జీ న్యూస్-బార్క్ తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలుండగా.. మెజార్టీ 35 సీట్లు వచ్చిన పార్టీదే అధికారం.
కాగా, ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ 35-40 సీట్లను గెలుచుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ 20-25 సీట్లకే పరిమితమవుతోంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 0-3 సీట్లు దక్కే అవకాశం ఉంది. ఇతరులు 1-5 స్థానాల్లో గెలుపొందనున్నారని అంచనా వేసింది. అధికార బీజేపీతోపాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విస్తృత ప్రచారం నిర్వహించాయి.
మరోవైపు, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడుతున్నాయి. ఆ రాష్ట్రంలో కూడా బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. 182 స్థానాలున్న గుజరాత్ రాష్ట్రంలో 92 స్థానాలు దక్కించుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. అయితే, బీజేపీకి వంద స్థానాలకుపైగా గెలుచుకుంటుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.