గూగుల్ సెర్చ్: అగ్రస్థానంలో మోడీ, రెండో స్థానంలో..
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురించి తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారని, దీంతో గూగుల్ సర్చ్లో ఎక్కువగా వెతుకుతున్న భారత రాజకీయ నాయకులలో మోడీ అగ్రస్థానంలో నిలిచారని గూగుల్ సంస్థకు చెందిన శోధన దిగ్గజం జీట్జీస్ట్ బుధవారం విడుదల చేసిన తన 2013 నివేదికలో పేర్కొంది.
అంతేగాక 2013 వార్తాల సందర్భాలలో కూడా ఎక్కువగా సర్చ్ చేసిన జాబితాలో నరేంద్ర మోడీ తొలిస్థానంలో నిలిచారని తెలిపింది. జీట్ జీస్ట్ అనే శోధన సంస్థ ఒక ఏడాదిలో ఏయే అంశాల కోసం నెటిజన్లు ఎక్కువ సర్చ్ చేశారనే నివేదికను రూపొందిస్తుంది. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభావంతోనే బిజెపి గెలుపొందిందనే విషయాన్ని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి అభ్యర్థులే ప్రకటించడంతో ఆయన గురించి తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది భారత రాజకీయ నాయకుల్లో నరేంద్ర మోడీ ఎవరంటూ అత్యధిక మంది నెటిజన్లు గూగుల్ సర్చ్ ఇంజిన్ను ఆశ్రయించారని జీట్జీస్ట్ విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. కాగా రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత టాప్-5లో ఉన్నారని తెలిపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ 6వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, లోక్సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ టాప్-10లో ఉన్నారు.
గూగుల్ సర్చ్ న్యూస్ ఈవెంట్స్ కేటగరిలో నరేంద్ర మోడీ అగ్రస్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో బ్లాక్బెర్రీ అమ్మకాలు, రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్, సైనా నెహ్వాల్, విజయ్ మాల్యా (కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్), కర్ణాటక ఎన్నికల ఫలితాలు, అరుషి తల్వార్ కేసు, ఏయిర్ ఇండియా న్యూస్, భారత ఆర్థిక వ్యవస్థ, ల్యాప్టాప్ల పంపిణీ మొదలగు అంశాలు టాప్-10లో ఉన్నాయి.












Click it and Unblock the Notifications