వెజిటేరియన్కు నాన్ వెజ్ ఫుడ్ పంపిన జొమాటో.. కోర్టు సీరియస్.. రూ.55వేలు ఫైన్..
పూనే : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లు అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఆకలి కష్టాలు తీరాయి. కూర్చొన్న చోట నుంచి మొబైల్లో ఆర్డర్ చేస్తే చాలు కోరుకున్న పదార్థాలు వచ్చి ముందు వాలతాయి. అయితే అప్పుడప్పుడు ఆ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాంలు రాంగ్ డెలివరీలతో కస్టమర్లను పెట్టే తిప్పలు అన్నీ ఇన్నీకావు. ఇటీవలే మహారాష్ట్రలోని పూనేలో ఇలాంటి ఘటనే జరిగింది. వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే నాన్ వెబ్ పంపి చిరాకు తెప్పించింది. చేసిన తప్పుకు ప్రతిఫలంగా రూ.55 వేల రూపాయలు సమర్పించుకోవాల్సి వచ్చింది.
తెలివి తెల్లారినట్టే ఉంది..!బిర్యానీతో పాటు 40 వేలు సమర్పించుకున్న జీనియస్ ఉమెన్..!!
జొమాటోలో వెజ్ ఫుడ్ ఆర్డర్
ముంబైకి చెందిన దేశ్ముఖ్ బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్లో లాయర్గా పనిచేస్తున్నారు. ఓ పని మీద పూనేకు వెళ్లిన దేశ్ ముఖ్ ఆ రోజు ఉపవాసం ఉన్నారు. సాయంత్రం ఉపవాసం విడిచేందుకు జొమాటోలో ఓ పంజాబీ హోటల్ నుంచి పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేశాడు. కాసేపటికి డెలివరీ బాయ్ పార్శిల్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్లాడు. అది ఓపెన్ చేసి చూసిన దేశ్ముఖ్ షాక్ అయ్యాడు. తాను బటర్ పన్నీర్ మసాలా ఆర్డర్ చేయగా.. హోటల్ నుంచి బటర్ చికెన్ పంపారు.
మళ్లీ బటర్ చికెన్ పంపిన హోటల్
బటర్ చికెన్ తెచ్చిన డెలివరీ బాయ్కి ఫోన్ చేసిన దేశ్ముఖ్ విషయం చెప్పాడు. అయితే బాయ్ తనకు సంబంధంలేదని చెప్పడంతో వెంటనే హోటల్కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. దీంతో జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పిన హోటల్ సిబ్బంది పన్నీర్ బటర్ మసాలా పంపిస్తామని చెప్పింది. కాసేపటికి ఓ డెలివరీ బాయ్ పార్శిల్ తీసుకురాగా.. అప్పటికే బాగా ఆకలి మీదున్న దేశ్ముఖ్ ఆబగా ఓ ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అయితే పంటికింద నలిగింది పన్నీర్ ముక్క కాదని తెలుసుకుని మళ్లీ షాకయ్యాడు. పరీక్షించి చూడగా హోటల్ సిబ్బంది మళ్లీ బటర్ చికెన్ పంపినట్లు గుర్తించాడు.
జొమాటోపై కన్జ్యూమర్ ఫోరంలో కంప్లైంట్
అసలే న్యాయవాది.. ఆపై ఆకలి మీద ఉన్న దేశ్ముఖ్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. వెజిటేరియన్ అయిన బటర్ చికెన్ పంపడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కోపం నషాళానికంటింది. శాఖాహారి అయిన తనకు మాంసాహారం తినిపించి తన ధార్మిక భావనల్ని దెబ్బతీశారంటూ హోటల్తో పాటు జొమాటోపై కన్జ్యూమర్ ఫోరంలో కంప్లైంట్ చేశారు. దేశ్ముఖ్ పిటీషన్పై విచారణ జరిపిన ఫోరం జొమాటోతో పాటు హోటల్కు నోటీసులు జారీ చేసింది. దానిపై స్పందించిన హోటల్ యాజమాన్యం తప్పు ఒప్పుకుంది. జొమాటో మాత్రం తమ తప్పేమీలేదని, హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని వాదించింది. ఇరు వర్గాల వాదనలు విన్న కన్జ్యూమర్ ఫోరం జరిగిన తప్పులో జొమాటోతో పాటు హోటల్ యాజమాన్యానికి భాగం ఉందని స్పష్టం చేసింది. వారి తప్పు కారణంగా ఇబ్బంది పడ్డ దేశ్ముఖ్కు రూ.55,000 పరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది.