ఒళ్లు గగుర్పొడిచేలా.. అత్యంత హేయంగా.. 13వేల మంది బలి
తోటి ఖైదీలతోనే ఖైదీలను రేప్ చేయించడం.. కర్రలు, రాడ్లతో రక్తం కక్కేదాకా కొట్టడం.. నేల మీద రక్తం గడ్డ కట్టి మురికితో కంపు కొడుతుంటే.. అదే నేల మీద నాలుగు మెతుకులు వేసి తినేదాకా చావబాదడం..
సిరియా: తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నవారికి ఉరిశిక్షలు వేస్తారని తెలుసు గానీ.. ఆ ఉరి కన్నా ముందు వారికి ప్రత్యక్ష నరకమంటే ఏంటో చూపించడం గురించి విన్నారా? ఒకవేళ విన్నా.. కచ్చితంగా ఇలాంటి శిక్షల గురించి మాత్రం విని ఉండరు.
సయద్నాయ జైల్లో జరుగుతోన్న మానవ హనన కాండల గురించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివ్వెరపోయే విషయాలు బయటపెట్టింది. ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతోన్న ఈ దారుణ ఆకృత్యాల గురించి వింటే ఒళ్లు గగుర్పొడవాల్సిందే. అత్యంత హేయమైన రీతిలో ఇక్కడ ఖైదీలను హింసిస్తూ.. ఉరితీస్తున్నారు.
ప్రతీ నిత్యం ఇదే తంతు:
అర్థరాత్రి కాగానే కొంతమంది జైలు అధికారులు వచ్చి.. ఓ యాభై, అరవై మంది ఖైదీలను విచారణ పేరిట బయటకు తీసుకెళ్తారు. అలా వెళ్లినవారు మళ్లీ తిరిగిరారు.. వారిని ఏంచేస్తారు? ఎక్కడికి తీసుకెళ్తారు? అన్న విషయాలు ఎవరికి తెలియవు.

మరి వీళ్లేమైనా.. కరుడు గట్టిన నేరస్తులా? అంటే.. ఇందులో మామూలు నేరస్తులు కూడా ఉన్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనను వ్యతిరేకిస్తున్నవారే ఇందులో ఎక్కువమంది ఉన్నట్టుగా తెలుస్తోంది.
తల నుంచి మొండెం వేరు చేసి:
అర్థరాత్రి బయటకు తీసుకెళ్లిన ఖైదీలను ఏంచేస్తున్నారో తెలుసుకునేందుకు ఆమ్నెస్టీ దర్యాప్తు చేసింది. ఇందుకోసం మాజీ జడ్జీలను పలువురిని కలిసి వివరాలు సేకరించింది. ఆ వివరాల ప్రకారం.. ఉరికన్నా కొద్దిరోజుల ముందే తిండి పెట్టకుండా ఖైదీలను హింసిస్తారు.
తిండి, నిద్ర లేక బక్క చిక్కిన ఖైదీలను లాకప్ నుంచి తీసుకెళ్లి ఉరితీస్తారు. అయితే అప్పటికే చాలావరకు బక్కచిక్కిపోయి ఉండటంతో.. ఉరికి వేలాడే వారి శరీరాలు చాలాసేపటివరకు ప్రాణం కోల్పోవు.
ఇలాంటి సందర్బాల్లో కొంతమంది గార్డులు ఆ శరీరాలను కాళ్లు పట్టుకుని బలంగా కిందకు లాగుతారు. అలా తల నుంచి మొండెం వేరుపడేదాకా.. చిత్రహింసకు గురిచేస్తారు. అనంతరం అదే చీకట్లో హననం చేస్తారు.
ఖైదీలకు ప్రత్యక్ష నరకం ..
తోటి ఖైదీలతోనే ఖైదీలను రేప్ చేయించడం.. కర్రలు, రాడ్లతో రక్తం కక్కేదాకా కొట్టడం.. నేల మీద రక్తం గడ్డ కట్టి మురికితో కంపు కొడుతుంటే.. అదే నేల మీద నాలుగు మెతుకులు వేసి తినేదాకా చావబాదడం.. ఇలాంటి ప్రత్యక్ష నరకాన్ని అక్కడి ఖైదీలు నిత్యం అనుభవిస్తారు.
పొద్దున్నే వచ్చి.. ఈరోజు ఎంతమంది టపా కట్టారు? అంటూ వెకిలిగా ప్రశ్నిస్తుంటారు. ఈ దారుణ హననకాండలతో 2011 నుంచి 2015దాకా దాదాపు 13వేల మందిని బలిగొన్నట్టుగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బయటపెట్టింది.
డమస్కస్ నగరానికి 30కిమీ దూరంలో ఉన్న సయద్నాయ జైల్లో జరిగిన ఈ దాష్టికాల గురించి ఆమ్నెస్టీ బయటపెట్టడంతో.. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాగా. 2011లో బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది తిరుగుబాటు చేయగా.. ఇది అంతర్యుద్దానికి కారణమైంది. వారిలో కొంతమందిని ఖైదీలుగా బంధించగా.. ఇప్పటిదాకా యుద్దంలో 4లక్షల మంది చనిపోయినట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది.












Click it and Unblock the Notifications