కాల్పులు: 13మంది మృతి, ఒకే ఫ్యామిలీలో 8మంది
ఒహియో: అమెరికాలో రెండు వేర్వేరు చోట్ల చోటు చేసుకున్న కాల్పుల ఘటనల్లో 13మంది ప్రాణాలు కోల్పోయారు. ఒహియోలోని కొలంబస్ దక్షిణంలోని పికెటాన్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని తుపాకీతో కాల్చి కిరాతకంగా హత్య చేశారు. వారు పడుకున్న సమయంలో తుపాకీతో కాల్చి చంపారని అధికారులు వెల్లడించారు.
హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకరే అందరినీ చంపారా, ఎక్కువ మంది కలిసి ఆ దారుణానికి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. మృతుల్లో ఏడుగురు పెద్దవాళ్లు, ఓ టీనేజర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బాధితులంతా రోహెడెన్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన వారని... పైక్ కౌంటీ షరీఫ్ చార్లెస్ రీడర్ తెలిపారు. ముగ్గురు చిన్నారులు కాల్పుల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకులు ఎవరనే అంశంపై విచారణ జరుపుతున్నారు. మిగతా కుటుంబసభ్యులను జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
కాగా, అమెరికాలోని జార్జియాలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వరుస కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో శుక్రవారం జరిగిన ఈ రెండు ఘటనల్లో మొత్తం 13 మంది చనిపోయారు.
రెండు ఘటనలకు పాల్పడిన నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో కాల్పుల ఘటనలు అమెరికాలో తరచూ చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగించే అంశమే. కాల్పుల ఘటనలపై అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.