వరదల్లో 13 లక్షల మంది, 200 మంది భారత విద్యార్థులు కూడా , 800 ఏళ్లకు ఒకసారి ఇలా...
హరికేన్ హార్వే కారణంగా అమెరికాలోని టెక్సాస్లో కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల 13 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారు.
Recommended Video

హూస్టన్: హరికేన్ హార్వే కారణంగా అమెరికాలోని టెక్సాస్లో కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల 13 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారు. వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. టెక్సాస్లో ఈ స్థాయి వరదలు ఇంతకుముందెన్నడూ లేవని జాతీయ వాతావరణ సేవలవిభాగం ప్రకటించింది.
వర్షాలు ఇప్పట్లో తగ్గవని, బుధవారంనాటికి 127 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుందని అక్కడి జాతీయ వాతావరణ సేవలవిభాగం హెచ్చరించింది. గత 72 గంటల్లో 76.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. టెక్సాస్లోని పాఠశాలలు, విమానాశ్రయాన్ని వారంపాటు మూసివేయనున్నారు.

800 ఏళ్లకు ఒకసారి ఇలా...
800 ఏళ్లకు ఒకసారి ఈ స్థాయిలో వరదలు వస్తాయని అధికారులు చెప్పారు. వరదనీరు ఇళ్లను చుట్టుముట్టడంతో పైకప్పుపై కూర్చుని ప్రాణాలు కాపాడుకుంటున్న వెయ్యి మందికిపైగా రక్షించాలని ఫోన్లు చేస్తున్నారన్నారు.

కుండపోతగా వర్షాలు...
దాదాపు 30 వేల మందిని శిబిరాలకు తరలించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు 1200 మందిని రక్షించారు. హార్వే కారణంగా ఉష్ణమండలీయ తుఫాను ఏర్పడటంతో దక్షిణ టెక్సాస్, లూసియానాలో కుండపోత వర్షం కురుస్తోంది.

లూసియానాలో అత్యవసర పరిస్థితి...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లూసియానాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వరద విలయాన్ని సమీక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మంగళవారం టెక్సాస్ వెళుతున్నారు.

20 మంది వృద్ధరోగులను కాపాడిన ట్వీట్
నడుములోతు వరదనీటిలో చిక్కుకుపోయిన వృద్ధరోగులను ట్విటర్ సాయంతో కాపాడగలిగారు. టెక్సాస్లోని డికిన్సన్లో ఉన్న లావిటా బిల్లా నర్సింగ్హోమ్లో 20 మంది వృద్ధరోగులున్నారు. వరద ముంచెత్తుతుండటంతో యజమాని.. ఫొటో తీసి తన కుమార్తె, అల్లుళ్లకు ట్వీట్ చేశాడు. అల్లుడు దాన్ని రీట్వీట్ చేసి, అత్యవసర సహాయక సిబ్బంది స్పందించాలని కోరాడు. వారు రంగంలోకి దిగి హెలిక్యాప్టర్ సాయంతో ఆ 20 మంది వృద్ధరోగులను రక్షించారు.

చిక్కుకుపోయిన 200 మంది విద్యార్థులు...
గత 13 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అమెరికాను హరికేన్ హార్వే ముంచేసింది. ఈ వరదల్లో వందలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. టెక్సాస్ లోని యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ నీట మునిగింది. పీకల్లోతు వరద నీటిలో 200 మంది భారత విద్యార్థులు చిక్కుకుపోయారు.

సత్వర ఏర్పాట్లు: సుష్మా
భారతీయ విద్యార్థులు వరదల్లో చిక్కుకుపోయిన విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. షాలిని, నిఖిల్ భాటియా అనే ఇద్దరు విద్యార్థులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఆస్పత్రి పాలైన విద్యార్థుల కుటుంబీకులు.. అక్కడికి చేరేలా సత్వర ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

రాత్రికి రాత్రే ఖరీదైన ఔషధం పంపిణీ...
హరికేన్ హార్వే వల్ల 1.3 కోట్ల మంది ప్రజలు ప్రభావితులయ్యారు. వరదల సమయంలోనూ అరుదైన వ్యాధి లీష్మానియాసిస్ కు వాడే ఔషధాన్ని టెక్సాస్ ఆస్పత్రికి పంపించారు భారత సంతతి అమెరికన్ సీఈవో హరీశ్ కథరాని. సౌత్సైడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సీఈవో అయిన ఆయన.. రాత్రికి రాత్రే 49 వేల డాలర్ల ఖరీదైన ఔషధాన్ని పంపించారు.












Click it and Unblock the Notifications