Japan: ఒకే రోజు 155 భూకంపాలు-సునామీ హెచ్చరికలు మాత్రం..వణికిపోతున్న జపాన్...!
నిన్న ఒక్కరోజే జపాన్ లో 155 భూకంపాలు నమోదయ్యాయి. సెంట్రల్ జపాన్ లోని పలు ప్రావిన్స్ లలో ఏకధాటిగా కొనసాగిన 155 భూకంపాల ధాటికి ప్రజలు వణికిపోయారు.
అయితే భూకంపాలు తరచూ సంభవించే దేశం కావడంతో జనం అప్రమత్తంగా ఉండటంతో మరణాల సంఖ్య ఇప్పటివరకూ 30గానే నమోదు కావడం ఊరటనిస్తోంది. నిన్న 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాల నేపథ్యంలో జారీ చేసిన సునామీ హెచ్చరికల్ని ఇవాళ ఉపసంహరించారు.

మధ్య జపాన్లో నిన్న వచ్చిన శక్తివంతమైన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 30కి పెరిగిందని స్థానిక అధికారులను ఉటంకిస్తూ ఏఎఫ్పీ వార్తా సంస్ధ వెల్లడించింది. పద్నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. అయితే దేశవ్యాప్తంగా ఒకే రోజు 155 వరకూ భూకంపాలు వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. వీటి కారణంగా పలు ప్రావిన్సుల్లో జనం తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. కొందరు ఇళ్లలోనే చిక్కుకుపోయారు.
స్థానిక మీడియా ప్రసారం చేసిన వీడియాల్లో కూలిపోయిన భవనాలు, ఓడరేవు వద్ద మునిగిపోయిన పడవలు, లెక్కలేనన్ని కాలిపోయిన ఇళ్లు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు గడ్డకట్టడం వంటి దృశ్యాలు కనిపించాయి. పలు చోట్ల సూపర్ మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాలు, రోడ్లపైనా ధ్వంసమైన దృశ్యాలు కనిపించాయి. దీంతో స్ధానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జపాన్ లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది.
అయితే నిన్న 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపాల కారణంగా పలు చోట్ల సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అయితే ఇవాళ పరిస్ధితి కాస్త శాంతించడంతో సునామీ హెచ్చరికల్ని క్రమంగా ఉపసంహరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో జపాన్ లో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు.












Click it and Unblock the Notifications