ఉగ్రవాది ఆత్మాహుతి దాడి.. 18 మంది మృతి
నైరుతి పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న సూఫీ టెంపుల్ వద్ద గురువారం ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బలూచిస్తాన్: నైరుతి పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న సూఫీ టెంపుల్ వద్ద గురువారం ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఝల్ మగ్బీ టెంపుల్ ప్రాంగణంలో ఈ ఉగ్రదాడి జరిగింది. ఉన్నట్లుండి పెద్ద పెట్టున పేలుడు సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ ఉగ్రవాది భక్తుడిలా సూఫీ టెంపుల్ పరిసరాల్లో సంచరించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
పోలీసులు అతడిని నిలువరించే ప్రయత్నం చేయడంతో ఆ ఉగ్రవాది తనను తానే పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతిచెందడంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
అయితే దాడికి పాల్పడింది తామేనని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. మసీదులను టార్గెట్ చేసే తాలిబన్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.