అమెరికాలో భారత నర్సు దారుణ హత్య: భర్త అరెస్ట్
న్యూయార్క్: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేరళకు చెందిన ఓ నర్సుపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. కొట్టాయంకు చెందిన మెరీన్ జాయ్(26) తన భర్త(34)తో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తోంది. అక్కడేవున్న ఆస్పత్రిలో మెరీన్ నర్సుగా సేవలందిస్తోంది. అయితే, గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.
మంగళవారం ఉదయం మెరీన్ తన విధులను ముగించుకొని ఆస్పత్రి నుంచి ఇంటికి బయలుదేరింది. అదే సమయంలో పార్కింగ్ స్థలంలో వేచివున్న భర్త ఫిలిప్ మ్యాథ్యూ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతేగాక, కిందపడిపోయిన ఆమెపైనుంచి కారును తీసుకెళ్లాడు.
తీవ్రగాయాలపాలైన మెరీన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడైన ఫిలిప్ మ్యాథ్యూను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.