బాంబు ఉందన్న అనౌన్స్మెంట్తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
విమానంలో ఉన్న ఓ బాత్రూంలో బాంబు పేలుడు హెచ్చరికకు సంబంధించిన ఒక నోట్ కనిపించడంతో ఈ ప్రచారం జరిగింది.
సిడ్నీ: ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చొని.. విమానం టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. బాంబులు పెట్టారన్న వార్త వారి గుండెలదిరిపడేలా చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా విమానం నుంచి బయటకు దూకేశారు. తీరా విమానంలో తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్.. అలాంటిదేమి లేదని తేల్చిపారేసింది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిడ్నీ నుంచి ఆల్బరీ నగరానికి వెళ్లడానికి సిద్దంగా ఉన్న విమానంలో.. బాంబు హెచ్చరికకు సంబంధించిన ప్రకటన వినిపించింది. విమానంలో బాంబు ఉన్నట్లు తేలిందని, లగేజీ వదిలేసి ఎవరికి వారు వెంటనే బయటపడాలని అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
విమానంలో ఉన్న ఓ బాత్రూంలో బాంబు పేలుడు హెచ్చరికకు సంబంధించిన ఒక నోట్ కనిపించడంతో ఈ ప్రచారం జరిగింది. దీంతో విమానంలో ఉన్న 42మంది ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు దూకేశారు. ఆ తర్వాత పోలీసులు, బాంబు స్క్వాడ్ కలిసి తనిఖీలు నిర్వహించగా.. అలాంటిదేమి లేదని తేలిపోయింది. అయితే బాత్రూంలో బాంబు హెచ్చరిక నోట్ ను అందించిన వ్యక్తిని పోలీసులు పట్టుకోగలిగారు.