Fire at Iraq Covid hospital : కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం... 44 మంది మృతి,67 మందికి గాయాలు
ఇరాక్లోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందగా 67 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆక్సిజన్ ట్యాంకు పేలుడు వల్లే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఇరాక్లోని నసిరియా నగరంలో ఉన్న అల్ హుస్సేన్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రస్తుతం మృతదేహాల వెలికితీతకు రెస్క్యూ టీమ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఆస్పత్రి భవనమంతా పొగతో నిండి ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది.మరోవైపు,ఈ ఘటనపై అత్యవసర సమావేశం నిర్వహించిన ఇరాక్ ప్రధాని ముస్తాఫా అల్ కదిమి ఆ ఆస్పత్రి మేనేజర్ను సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు.అలాగే ఆరోగ్య,పౌర రక్షణ శాఖల మేనేజర్లను కూడా తొలగించడంతో పాటు అరెస్టుకు ఆదేశాలిచ్చారు.
ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకు పేలుడుతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడి క్షణాల్లో అంతటా వ్యాపించినట్లు తెలుస్తోంది. దీంతో బయటపడే మార్గం లేక చాలామంది అగ్నికి ఆహుతయ్యారు. పేలుడు జరిగినట్లుగా భారీ శబ్దం వినిపించిందని... ఆ తర్వాత క్షణాల్లో మంటలు వ్యాపించాయని ఆస్పత్రిలో పనిచేసే గార్డ్ అలీ ముషీన్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చనిపోయినవారి కుటుంబ సభ్యులు,బంధువులు ఆస్పత్రి వద్దకు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రెండు పోలీస్ వాహనాలకు నిప్పంటించారు.
ఈ ఏడాది ఏప్రిల్లోనూ ఇరాక్ రాజధాని బాగ్ధాద్లో ఉన్న ఓ కోవిడ్ ఆస్పత్రిలో భారీ పేలుడు సంభవించింది. ఆక్సిజన్ ట్యాంకు పేలడంతో 82 మంది మృతి చెందగా 110 మంది గాయపడ్డారు.
ఇప్పటికే అంతర్గత యుద్ధం,ఆంక్షల కారణంగా ఇరాక్ హెల్త్ కేర్ వ్యవస్థ కోవిడ్ను ఎదుర్కోవడంలో తీవ్రంగా సతమతమవుతోంది. కోవిడ్ కారణంగా ఇప్పటివరకూ ఇరాక్లో 17,592 మంది మృతి చెందగా 10,40,000 మంది వైరస్ బారినపడ్డారు.
Recommended Video
ఓవైపు రాజకీయ హింస,మరోవైపు విపరీతమైన అవినీతి కారణంగా ఇరాక్లో మౌలిక సదుపాయాలు శిథిల దశకు చేరుకున్నాయి. దీంతో తరుచూ ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.