టర్కీ, జకార్తాల్లో బాంబు పేలుళ్లు: 11మంది మృతి
జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తా గురువారం ఉదయం బాంబులతో దద్దరిల్లింది. ఐక్యరాజ్యసమితి కార్యాలయం, సరినాహ్ షాపింగ్మాల్ ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి.
వరుసగా ఆరు సార్లు పేలుళ్లు సంభవించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతిచెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. కాగా, ఇది ఉగ్రవాదుల పనేనని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రకటించారు.
కాగా, దాడికి పాల్పడిన దుండగులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురు ఉగ్రవాదులు నగరంలోని ఓ థియేటర్ కాంప్లెక్స్లో దాక్కున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పేలుళ్ల ఘటనలో ముగ్గురు పోలీసులు, ముగ్గురు సాధారణ పౌరులు మృతి చెందారు. గురువారం ఉదయం 10-11గంటల ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించాయి. స్టార్బక్స్ కేఫ్లో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. థియేటర్లోనే ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు.. అధికారికంగా ధృవీకరించలేదు.
టర్కీ, పాకిస్థానీలకు చెందిన ఎంబసీల సమీపంలో మరో మూడు బాంబు పేలుళ్లు సంభవించాయని అక్కడి టీవీ ఛానళ్లు చెబుతున్నాయి. ఘటన స్థలంలో భారీగా పోలీసులు, భద్రతా దళాలు మోహరించాయి. పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. సుమారు 10 నుంచి 15మంది సాయుధులైన ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు.
టర్కీలో పేలుళ్లు: ఐదుగురి మృతి
టర్కీలోని డియార్బకిర్ రాష్ట్రంలో గురువారం తెల్లవారుజామున పోలీస్ హెడ్క్వార్టర్స్పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనాంతరం పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బాంబు దాడిలో ఐదుగురు పోలీసులు మృతిచెందగా, కాల్పుల్లో 8మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పేలుడులో 36 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు.