పాక్ బరితెగింపు: భారత భూగాన్ని చైనాకు అమ్మేస్తోంది!
పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. ఏకంగా 70ఏళ్ల క్రితం భారత్ నుంచి దొంగచాటుగా ఆక్రమించుకున్న గిల్గిత్-బాల్టిస్థాన్లోని చాలా భాగాన్ని చైనాకు పాకిస్థాన్ విక్రయిస్తోంది.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. ఏకంగా 70ఏళ్ల క్రితం భారత్ నుంచి దొంగచాటుగా ఆక్రమించుకున్న గిల్గిత్-బాల్టిస్థాన్లోని చాలా భాగాన్ని చైనాకు పాకిస్థాన్ విక్రయిస్తోంది. చైనా సామ్రాజ్యావాదానికి మద్దతు పలుకుతూ చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) పేరిట ఈ భూమిని స్థానికులకు ఇష్టం లేకుండానే బలవంతంగా లాగేసుకుని చైనాకు అప్పగించేస్తోంది పాకిస్థాన్.
చైనాలోని పలు కంపెనీలకు, రెడ్ ఆర్మీకి గిల్గిత్ బాల్టిస్థాన్ భూములను అక్రమంగా విక్రయిస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు. ఓ మీడియా సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ జనరల్స్ బలవంతంగా దౌర్జన్యం చేసి ఆ భూమిని ఆక్రమిస్తున్నారు.
భూములిచ్చేందుకు నిరాకరిస్తున్నవారిని అకారణంగా చంపివేయడంతోపాటు ఎలాంటి విచారణ లేకుండానే శిక్షలకు గురిచేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే వేల మంది తమ భూమిని కోల్పోయినట్లు సదరు మీడియా సంస్థ సేకరించిన వివరాల్లో తేలింది.
'పాక్ మిలిటరీ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు తమ ప్రాంతంలోకి వచ్చి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. అత్యంత నిరంకుశంగా జరుగుతున్న ఈ పరిపాలన గురించి ఏ ఒక్కరం కూడా నోరెత్తలేని పరిస్థితి ఉంది. సీపీఈసీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి జీవితాలు నాశనం చేస్తున్నారు' అని గిల్గిత్-బాల్టిస్థాన్ థింకర్స్ ఫోరం ఛైర్మన్ సదరు మీడియాకు వివరించారు.
కాగా, పెద్ద కంటోన్మెంటులు ఏర్పాటు చేసి వాటిల్లో చైనా, పాక్ సైన్యాలు ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారని కూడా ఆయన తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కంటే ఈ భూభాగం ఆరింతలు పెద్దదిగా ఉండటం గమనార్హం.