క్వెట్టాలో భారీ పేలుళ్లు: 93మంది మృతి, 100మందికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. క్వెట్టాలో జరిగిన భారీ పేలుడులో సుమారు 93మంది మృతి చెందారు. వందమందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు.
ఓ న్యాయవాది హత్య జరగడంతో అతడికి ఆస్పత్రి వద్ద నివాళులర్పించేందుకు భారీ ఎత్తున న్యాయవాదులు గుమిగూడారు. కాగా, ఓ ఆత్మాహుతి బాంబర్ ఇక్కడి వచ్చి పేల్చుకోవడంతో ఈ పేలుళ్ళు జరిగాయి.
వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
'బలోచిస్థాన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని సోమవారం ఉదయం ఎవరో దుండగులు హత్య చేశారు. అతడ్ని క్వెట్టాలోని ఆస్పత్రిలో చేర్చారు. దీంతో ఇక్కడికి భారీగా వచ్చిన న్యాయవాదులు, జర్నలిస్టులు అతనికి నివాళులర్పించారు. ఈ క్రమంలోనే ఓ ఉగ్రవాది గుంపులో చేరి ఆత్మాహుతికి పాల్పడ్డాడు' అని బలోచిస్థాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తి తెలిపారు.