కుమారుడి కోసం డ్రగ్స్ సరఫరా: మహిళకు ఉరి శిక్ష
లండన్: చేసిన తప్పు తలుచుకుని కుటుంబ సభ్యులకు చివరిసారిగా ఉత్తరాలు వ్రాసి మనస్సు తేలిక చేసుకుంది. ఎప్పుడు ఉరి తీస్తారో తెలియక ఆమె మృత్యువు కోసం ఎదురుచూస్తున్నది. కుమారుడిని రక్షించుకునేందకు ఆమె డ్రగ్స్ సరఫరా చేసింది.
ఇండోనేషియాలో డ్రగ్స్ సరఫరా చేసేవారిని ఉరి తీస్తారు. ఇటివలే డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఏడుగురిని ఉరి తీశారు. అనేక దేశాలు వ్యతిరేకించినా ఇండోనేషియా ప్రభుత్వం పట్టించుకోలేదు.ఇంగ్లాండ్ కు చెందిన లిండ్ సే సాండీపోర్డ్ (58) అనే మహిళ డ్రగ్స్ సరఫరా చేస్తూ 2013లో ఇండోనేషియా పోలీసులకు చిక్కిపోయింది.
ప్రస్తుతం జైలులో ఉన్న లిండే సేకి ఉరి శిక్ష విధించారు. ఇటీవల ఈమె కుటుంబ సభ్యులు, బంధువులకు ఉత్తరాలు వ్రాశారు. "ఇక మీద నన్ను మీరు చూసే అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడు నన్ను ఉరి తీస్తారు అనే విషయం తెలియడం లేదు. నేను తప్పు చేశాను" అని చెప్పింది.
"మీరు సంతోషంగా ఉండండి, నా మనుమరాలిని జాగ్రతగా చూసుకోండి" అని ఉత్తరాలలో వ్రాసింది. ఇంగ్లాండ్ కు చెందిన మీడియా లిండ్ సేను కలిసి ఇంటర్యూ చేశారు. ఉరి తీస్తున్నందుకు మీకు భయంగా లేదా అని ప్రశ్నించారు. డ్రగ్స్ ఎందుకు సరఫరా చేశారు అని ఆరా తీశారు.
డ్రగ్ ముఠా సభ్యులు తన కుమారుడిని కాల్చి చంపుతామని బెదిరించడం వలనే తాను డ్రగ్స్ సరఫరా చెయ్యవలసి వచ్చిందని ఆమె అన్నారు. తనను ఉరి తీస్తున్నందుకు భయంగా లేదని ఆమె చెప్పారు. తాను అరెస్టు అయిన తరువాత మనమరాలు జన్మించిందని, ఆ పాపకు ఇప్పుడు రెండు సంవత్సరాలు అన్నారు.
తాను చివరి సారిగా తన మనుమరాలిని చూడాలని ఉందని ఆమె చివరి కోరిక చెప్పారు. అయితే ఇండోనేషియా ప్రభుత్వం అందుకు అనుమతి ఇస్తుందో లేదో చూడాలి. ఉరి శిక్ష పడిన లిండ్ సే చాల ధైర్యంగా ఉన్నారని ఇంగ్లాండ్ మీడియా వెల్లడించింది.