ఇమ్రాన్ ఖాన్ను సూటి ప్రశ్న అడిగిన పాకిస్తానీ హౌజ్వైఫ్, ప్రధాన మంత్రి ఏం చెప్పారంటే..
సామాన్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే ''ఆప్కా వజీర్-ఇ-ఆజమ్, ఆప్కో సాథ్’’ కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ప్రజలతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రికి కొందరు సూటి ప్రశ్నలు అడిగారు. అలా ప్రశ్నలు అడిగిన వారిలో రావల్పిండీకి చెందిన గృహిణి సయీదా నాజ్ ఒకరు.
''నేను రావల్పిండీకి చెందిన హౌస్వైఫ్ను. ప్రధాన మంత్రి సర్, గత ఏడాది ఇదే కార్యక్రమంలో ద్రవ్యోల్బణాన్ని త్వరలోనే కట్టడి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణం రెట్టింపు అయ్యింది. బహుశా మీరు మా దగ్గర నిజాన్ని దాచిపెట్టి ఉండొచ్చు. మీరు చేసేది ఏమీ లేకపోతే, ఒకసారి ఆన్లైన్లోకి వెళ్లి పప్పులు, పిండి ధరలు చూడండి. ఆ తర్వాత మేం ఏం చేయాలో చెప్పండి’’అని సయీదా ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. ''ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మొబైల్ ఫోన్స్ కాలం. నేను రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే దాదాపు గంట సేపు మొబైల్ చూస్తాను. దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో చదువుతాను’’అని ఆయన అన్నారు.
https://twitter.com/appcsocialmedia/status/1485200533883437059
''రాత్రిపూట ఒక్కోసారి నన్ను మధ్యలోనే నిద్రలేపే అంశం ఏమిటంటే ఈ ద్రవ్యోల్బణమే. ప్రపంచంలో అన్ని చోట్లా ద్రవ్యోల్బణం ఇలానే ఉంది. నేను అధికారంలోకి వచ్చేటప్పుడు కరెంటు ఖాతా లోటు 20 బిలియన్ డాలర్లు (రూ.1,49,159 కోట్లు)గా ఉండేది. ప్రజలపై ధరల ఒత్తిడి తగ్గించేందుకు సరిపడా డాలర్లు మన దగ్గర లేవు. మన రూపాయి విలువ పతనం అవుతూనే ఉంది. అందుకే ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మరోవైపు ప్రపంచ సరఫరా వ్యవస్థలపై కరోనావైరస్ తీవ్రమైన ప్రభావం చూపుతోంది. దురదృష్టవశాత్తు మన దగ్గరున్న కొంతమంది జర్నలిస్టులు కేవలం పాకిస్తాన్లో మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
- పాకిస్తాన్ కరెన్సీ నోట్లపై జిన్నా చిత్రం ముద్రించడంపై ఎందుకు వ్యతిరేకత వచ్చింది
- 1971 భారత్-పాక్ యుద్ధం: పారిపోవడానికి ఎత్తులు వేసిన పాక్ యుద్ధఖైదీలకు చుక్కలు చూపిన భారత సైన్యం
కరోనావైరస్ ప్రభావంతో..
''ప్రపంచం మొత్తంగా కరోనావైరస్ ప్రభావం చూపుతోంది. అమెరికా, ఐరోపా కూడా దీని వల్ల ప్రభావితం అవుతున్నాయి. చమురు ధరలు రెట్టింపు అయ్యాయి. ఈ ధరలు అన్నింటిపైనా ప్రభావం చూపుతున్నాయి. ఈ కరోనా సంక్షోభం నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు అమెరికా 6000 బిలియన్ల డాలర్లు (రూ.447 లక్షల కోట్లు) ఖర్చు పెట్టింది. కానీ మనం రూ.59,664 కోట్లు మాత్రమే వెచ్చించాం. అంటే పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు’’అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
https://twitter.com/HamidMirPAK/status/1485203724414992387
ఇమ్రాన్ ఖాన్ సమాధానంపై పాకిస్తాన్కు చెందిన ప్రముఖ జర్నలిస్టు హమిద్ మీర్ ట్విటర్లో స్పందించారు. ''ఒక హౌస్వైఫ్.. ప్రధాన మంత్రికి సూటి ప్రశ్న అడిగారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామని గత ఏడాది చెప్పారు.. కానీ ఇప్పుడది రెట్టింపు అయ్యింది అని ఆమె చెప్పారు. ఆమె అడిగిన సూటి ప్రశ్నకు ఇమ్రాన్ ఖాన్ పెద్ద కథ చెప్పారు. పైగా బాధ్యతను మీడియాపైకి నెట్టేసే ప్రయత్నం చేశారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
- పాకిస్తాన్లో 'గాంధీ’ని కాపాడిన జిన్నా
- స్వాతంత్ర్య దినోత్సవం: నెహ్రూ, జిన్నాల మధ్య దూరం ఎలా పెరిగింది?
ప్రతిపక్ష నాయకుడిపైనా విమర్శలు
ప్రశ్నలు-సమాధానాల కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్పైనా ఇమ్రాన్ ఖాన్ విమర్శలు చేశారు. ''షాబాజ్ షరీఫ్.. ప్రతిపక్ష నాయకుడని అందరూ చెబుతున్నారు. కానీ, మనం ఆయన్ను కలవడం, మాట్లాడటం కుదరదు. నేనైతే ఆయన ప్రతిపక్ష నాయకుడని అనుకోవడం లేదు. మన దేశంలో ప్రతిపక్ష నాయకుడి పదవికి చాలా గౌరవముంది. కానీ ఆయన ఆ పదవికి కళంకం తీసుకొస్తున్నారు. పార్లమెంటులో ఆయన గంటన్నర నుంచి రెండు గంటలు ఆయన ప్రసంగిస్తారు. కానీ తన కుమారుడికి చెందిన రంజాన్ షుగర్ మిల్స్ కార్మికుడి ఖాతాలో 400 కోట్ల రూపాయలు ఎలా పడ్డాయో ఆయన చెప్పారు’’అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
https://twitter.com/PTIofficial/status/1485218125364748288
''కేవలం అణు బాంబుల వల్ల మాత్రమే విధ్వంసం జరగదు. నైతిక విలువలను వదిలిపెట్టినప్పుడు కూడా విధ్వంసక పరిణామాలు సంభవిస్తాయి. స్విట్జర్లాండ్లో కేవలం ఆవులు, పర్వతాలే కనిపిస్తాయి. కానీ ప్రపంచ ప్రముఖ దేశాల్లో స్విస్ కూడా ఒకటి. చట్టబద్ధమైన పాలనే ఆ దేశ అభివృద్ధికి కారణం’’అని ఆయన అన్నారు.
మార్చి 23న ప్రతిపక్షాల నిరసన గురించి అడిగిన ప్రశ్నపై ఇమ్రాన్ స్పందిస్తూ.. ''అది మూడేళ్లుగా కొనసాగుతోంది. ఇప్పుడు సాధారణ ప్రజలు విపక్షాల వెంట వెళ్లడం మానేశారు’’అని చెప్పారు.
- పాకిస్తాన్ జాతి పిత జిన్నా, రష్యా నేత లెనిన్లు తిలక్ గురించి ఏమన్నారంటే..
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
''నేను ప్రభుత్వం నుంచి దిగిపోతే, అది వారికి మరింత ప్రమాదకరం. ఇప్పటివరకు నేను అన్నీ మౌనంగా చూస్తూ కూర్చున్నాను. నేను వీధుల్లోకి వస్తే, వారికి దాక్కోడానికి చోటు ఉండదు. ప్రజలు మిమ్మల్ని గుర్తుపడతారు. మీరు గత 30-35 ఏళ్లుగా చేసిన పనుల లావా నేటికీ ఉప్పొంగుతోంది. మేం తలచుకుంటే, మీరు లండన్కు పరిగెడతారు’’అని ప్రతిపక్షాలను ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.
https://twitter.com/MIshaqDar50/status/1485316960829292546
ఇమ్రాన్ వ్యాఖ్యలపై నవాజ్ షరీఫ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఇషాక్ డార్ స్పందించారు. ''తాము అధికారంలోకి వస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని ఇదివరకు వారు చెప్పారు. ఇప్పుడేమో ప్రభుత్వం నుంచి బయటకు వస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని అంటున్నారు. గత 25ఏళ్ల నుంచీ మేం ఇలాంటి వ్యాఖ్యలే వింటున్నాం’’అని ఆయన వ్యాఖ్యానించారు.
https://twitter.com/MaryamNSharif/status/1485222918489579529
మరోవైపు పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) నాయకురాలు మరియమ్ నవాజ్ కూడా ఇమ్రాన్ వ్యాఖ్యలపై స్పందించారు. ''ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ నిజస్వరూపం కనబడుతోంది. ఆయన ఓడిపోవడమే కాదు.. ఓటమిని అంగీకరిస్తున్నారు కూడా. ఆయన అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ ఆయన ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. నవాజ్ షరీఫ్ కుటుంబం, పీఎంఎల్ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. మీ నిజస్వరూపాన్ని ఇప్పుడు అందరూ చూస్తున్నారు’’అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గాంధీని హత్య చేసే సమయానికి నాథూరామ్ గాడ్సే నిజంగానే ఆర్ఎస్ఎస్ను విడిచిపెట్టారా? ఆ రహస్యమేమిటి..
- ఆన్లైన్ గేమ్స్ ఆడి కోటీశ్వరులు కావొచ్చు
- బొబ్బిలి యుద్ధానికి 265 ఏళ్లు: ఆ రోజున ఏం జరిగింది?
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- అయోధ్యలో 251 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం: 'అయ్యా, మమ్మల్నందరినీ ఇక్కడే పాతిపెట్టి, మా భూమిని తీసుకోండి'
- గ్రీన్ గోల్డ్: ఈ పండ్లను బంగారంలా చూస్తారు.. వీటి కోసం దొంగల ముఠాలు కాపు కాస్తుంటాయి
- అర్చకత్వం చేస్తూనే 9 పీజీలు పూర్తి చేసిన పూజారి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)