రష్యన్ కంపెనీతో డీల్: 'కిమ్' రూట్ మార్చాడా?, ప్రపంచానికి సైబర్ ముప్పు!..
రష్యాకు చెందిన ట్రాన్స్ టెలికాం అనే కంపెనీతో ఉత్తరకొరియా తాజా ఇంటర్నెట్ ఒప్పందం కుదరినట్లు తెలుస్తోంది.
ప్యోంగ్యాంగ్: ఉత్తరకొరియా గురించి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సమాచారం చాలా తక్కువ. ఆ దేశ అంతర్గత విషయాల గురించి ఏ దేశం వద్ద స్పష్టమైన నివేదికలు లేవు. ఆ దేశ వాసుల్ని ప్రపంచంతో కమ్యూనికేట్ కాకుండా చేయడంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు ఇప్పటికీ నియంత లాగే వ్యవహరిస్తుంటాడు.
ఫోటోలు నిషిద్దం, ఫోన్ల వినియోగం తక్కువ, ఇంటర్నెట్ వినియోగం అంతకన్నా తక్కువ. బయటి ప్రపంచం గురించి ఉత్తరకొరియన్లకు, వారి గురించి బయటి ప్రపంచానికి అతి కొద్ది సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. ఉత్తరకొరియాకు సంబంధించిన ఏ వార్త అయినా సరే.. అధ్యక్షుడి అనుమతి లేనిదే అంతర్జాతీయంగా ప్రచారం కాదు. అక్కడ పనిచేసే మూడు చానెల్స్ అధ్యక్షుడు కిమ్ నియంతృత్వంలోనే నడుస్తాయి.

రూట్ మార్చాడా?:
ఇన్నాళ్లు ప్రపంచంతో కమ్యూనికేషన్కు దూరంగా ఉన్న ఉత్తరకొరియా.. ఇప్పుడు ఆ సంబంధాలను పునరుద్దరించుకోబోతుందా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నెట్ విస్తృతి కోసం ఆ దేశం తీసుకున్న చర్యలు ఈ అనుమానాలను లేవనెత్తుతున్నాయి. అయితే ఇది కమ్యూనికేషన్ కోసమా? లేక ఉత్తరకొరియా మరేదైనా కుట్రపూరిత వ్యవహారానికి తెరలేపుతోందా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

సైబర్ దాడులు చేయడానికా?:
ఉత్తరకొరియా తన ఇంటర్నెట్ విస్తృతిని పెంచుకోవడం వెనుక సైబర్ దాడుల లక్ష్యం ఏమైనా దాగుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే జరిగితే ప్రపంచ దేశాలు ఉత్తరకొరియా నుంచి భారీ సైబర్ ముప్పును ఎదుర్కొనే సూచనలున్నాయి.
ఉత్తరకొరియన్లను ప్రపంచ దేశాలతో కమ్యూనికేట్ కాకుండా జాగ్రత్తపడుతూ వస్తున్న కిమ్.. ఉన్నపలంగా వారికి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాబట్టి తాజా ఇంటర్నెట్ ఒప్పందం.. ప్రపంచ దేశాలపై సైబర్ దాడులకు ఉద్దేశించినదే అన్న ప్రచారం జరుగుతోంది.

రష్యా కంపెనీ:
రష్యాకు చెందిన ట్రాన్స్ టెలికాం అనే కంపెనీతో ఉత్తరకొరియా తాజా ఇంటర్నెట్ ఒప్పందం కుదరినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం 5.30గం. నుంచి ఉత్తరకొరియాకు ట్రాన్స్ టెలికాం కంపెనీ నుంచి ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయని ఇంటర్నెట్ అనలిస్టులు చెబుతున్నారు. ఉత్తరకొరియాలో దాదాపు 60శాతం ఇంటర్నెట్ ట్రాఫిక్ను ట్రాన్స్ టెలికాం హ్యాండిల్ చేయనుందని తెలుస్తోంది.

అప్రమత్తం:
రష్యా కంపెనీతో ఉత్తరకొరియా ఇంటర్నెట్ ఒప్పందం గురించి తెలియగానే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ సైబర్ భద్రతను కట్టుదిట్టం చేసుకోవడంపై ఫోకస్ చేశాయి. ఉత్తరకొరియా నుంచి తమ నెట్ వర్క్ కాపాడుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఓ సీనియర్ అధికారి తెలిపినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications