పౌరసత్వ సవరణ బిల్లు ఎఫెక్ట్: బంగ్లాదేశ్ కీలక నిర్ణయం: ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతతో అప్రమత్తం..!
ఢాకా: దేశవ్యాప్తంగా త్వరలో అమలులోకి రానున్న పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో.. బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బంగ్లాదేశ్ సరిహద్దులను ఆనుకుని ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో మూడురోజులుగా చెలరేగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో అప్రమత్తమైంది. ఈ పరిస్థితులపై బంగ్లాదేశ్ లోని షేక్ హసీనా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది.
విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన రద్దు..
అస్సాం, త్రిపురలల్లో హింసాత్మక పరిస్థితులను నెలకొన్న నేపథ్యంలో- బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఏకే అబ్డుల్ మొమిన్ తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. గురువారమే ఆయన ఢాకా నుంచి న్యూఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. గురు, శుక్రవారాల్లో ఆయన మనదేశంలో పర్యటించాల్సి ఉంది. తన పర్యటన సందర్భంగా అబ్దుల్ మొమిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ లతో ఆయన భేటీ కావాల్సి ఉంది. భారత పర్యటనకు బయలుదేరాల్సిన రోజే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

బంగ్లాదేశ్ అసంతృప్తి
పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఆమోదించడం పట్ల బంగ్లాదేశ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్లే అబ్దుల్ మొమిన్ తన భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. అంతకుముందు- పౌరసత్వ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా అమలు చేయడం పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశించి అబ్దుల్ మొమిన్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యనాలు చేశారు. భారతీయ ముస్లింల గురించి అమిత్ షాకు అందిన సమాచారం అసంబద్ధమైనదని తాను భావిస్తున్నట్లు అబ్దుల్ మొమిన్ తెలిపారు.












Click it and Unblock the Notifications