'ఆ 276మంది బాలికల్ని పెళ్లాడా': పదేపదే రేప్ అంటూ..
మెయిదుగురి: నైజీరియాలో ఏప్రిల్లో ఉగ్రవాదులు అపహరించిన బాలికల విడుదల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. 276 మందికి పైగా బాలికలను ఇస్లాం మతంలోకి మార్చామని, వారిని తానే పెళ్లాడానని నైజీరియా ఉగ్రవాద సంస్థ బోకో హరమ్ నాయకుడు అబూబకర్ షెకావు ఒక వీడియో ద్వారా చెప్పాడు.
దీనిని అతను శుక్రవారం రాత్రి ఒక వార్తా సంస్థకు పంపించాడు. ఆ బాలికల సంగతి ఎప్పుడో మరిచిపోయానని, వాళ్లను చాన్నాళ్ల క్రితమే తాను పెళ్లాడానని తెలిపాడు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అతడు వీడియోలో నవ్వుతూ కనిపించాడు. ఏప్రిల్లో ఈశాన్య నైజిరియాలోని మారుమూల పట్టణం చిబోక్లో ఒక బోర్డింగ్ స్కూలులో పరీక్షలు రాస్తుండగా ఆ బాలికలను బోకో హరమ్ ఉగ్రవాదాలు అపహరించారు.
జిహాదీల భార్యలు ఇలా...
మత రాజ్య స్థాపనకోసం పవిత్ర యుద్ధాలు చేసే జిహాదీల భార్యలు ఎలా ఉండాలి? ఇంటి పనులు, వంట పనులు, ముజాహిదీన్లకు గాయాలైతే నర్సుల్లాగా సేవలు చేయడం.. ఇవి చేస్తే చాలని ఇరాక్, సిరియాల్లో నరమేధం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు అభిప్రాయపడుతున్నారు.
మహిళలు ఆయుధం పట్టకూడదని, యుద్ధం చేయకూడదని, మహిళలు చేసే పనులు మాత్రమే చేస్తే చాలంటున్నారు. అల్టిమేట్ వైవ్స్ ఆఫ్ జిహాద్ పేరిట వారు మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇందుకు నిదర్శనంగా ఐఎస్లో మహిళలు చేస్తున్న పనులతో కూడిన వీడియోను.. ఐఎస్ సోషల్ మీడియా విభాగం జోరా ఫౌండేషన్ యూ ట్యూబ్లో పెట్టింది. ఇదిలా ఉండగా, రెండు వారాల క్రితం ఐఎస్ ప్రారంభించిన సోషల్ మీడియా ఖాతాలకు అప్పుడే 2000 మంది ఫాలోయర్లు ఏర్పడ్డారు.
పదేపదే రేప్..
ఇక తాము చెరబడుతున్న యాజిదీ మహిళలను ఐఎస్ ఉగ్రవాదులు హీనంగా సెక్స్ బానిసల్లా చూస్తున్నారని, పదేపదే రేప్ చేసి, సంతలో పశువుల్లా ధరల పట్టీ తగిలించి మరీ అమ్మేస్తున్నారని కుర్దిస్థాన్ రీజినల్ గవర్నమెంట్ ఆన్ జెండర్ ఇష్యూస్ సలహాదారు ఒక నివేదికలో వివరించారు.
కొత్తగా యువకులను చేర్చుకునేందుకు అమ్మాయిలను ఎరగా చూపుతున్నారని, అందుకోసం యాజిదీ మహిళలు నివసించే గ్రామాలపై దాడి చేసి తడవకు ముగ్గురు, నలుగురిని ఎత్తుకుపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పటిదాకా కిడ్నాప్ చేసిన అమ్మాయిల సంఖ్య 2500గా ఉంది.
మహిళలు, బాలికల హక్కులనే కాదు, చిన్నారుల బాల్యాన్ని సైతం ఐఎస్ ఉగ్రవాదులు హరిస్తున్నారు. ఐదేళ్లు కూడా దాటని చిన్నారులకు ఉగ్రపాఠాలు బోధిస్తున్నారు. పదహారేళ్ల పిల్లలకు ఏకే 47లు ఇస్తూ వారిని ఆత్మాహుతి దళాలుగా మారుస్తున్నారు.