విరుచుకుపడుతోన్న తాలిబన్లు: ఆఫ్ఘన్ అల్లకల్లోలం: పలు నగరాలు వశం: కాబుల్ వైపు
కాబుల్: కొద్దిరోజుల కిందటి వరకూ ఆచూకీ తెలియకుండా పోయిన తాలిబన్లు.. మళ్లీ చెలరేగుతోన్నారు. ఆఫ్ఘనిస్తాన్పై పట్టు పెంచుకుంటోన్నారు. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న తరువాత.. ఒక్కో నగరం తాలిబన్ల వశమౌతూ వస్తోంది. ఇప్పటిదాకా తొమ్మిది ప్రావిన్స్లకు చెందిన రాజధానులను వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఆ ప్రావిన్సులన్నీ తమ వశమైనట్లు ప్రకటించుకున్నారు. ఈ తొమ్మిది ప్రావిన్సుల్లోనూ తమ పరిపాలన ఆరంభమౌతుందని ప్రకటన ఇచ్చారు. ఇక వారి లక్ష్యం ఆ దేశ రాజధాని కాబుల్. అటు వైపు దూసుకెళ్తోన్నారు.

కొనసాగుతోన్న ఆక్రమణలు..
అఫ్గానిస్తాన్లో తాలిబన్ల ఆక్రమణల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా మూడు ప్రావిన్సుల రాజధానులు వారి వశం అయ్యాయి. దీనితో ఇప్పటిదాకా వారు పట్టు పెంచుకున్న రాజధానుల సంఖ్య తొమ్మిదికి చేరింది. తాజాగా అఫ్గానిస్తాన్ ఉత్తర ప్రాంతంలోని ఫైజాబాద్, పుల్-ఐ-ఖుమ్రీ, పశ్చిమ ప్రాంతంలోని ఫరా నగరాలు తాలబన్ల సొంతం అయ్యాయి. ప్రభుత్వ ప్రతినిధులందరూ అక్కడి నుంచి ముందే వెళ్లిపోయారు. తమ కార్యాలయాలను ఖాళీ చేసి కాబుల్కు వెళ్లారు. ఇప్పటికే- కుందుజ్, సార్-ఐ-పుల్, తలోకాన్ పట్టణాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.

కుందుజ్పై పట్టు సాధించడం
భౌగోలికంగా, వ్యూహాత్మకంగా ఆఫ్ఘనిస్తాన్కు అత్యంత కీలకమైన నగరం.. కుందుజ్. ఆ దేశ ఉత్తర ప్రాంతం మొత్తానికీ అతి పెద్ద నగరం ఇది. రాజధాని కాబూల్ సహా దేశంలో ఏ ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకున్నా కుందుజ్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని సొంతం చేసుకోవడం తాము సాధించిన భారీ విజయంగా తాలిబన్లు ప్రకటించుకున్నారు. అక్కడి ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ వారు స్వాధీనం చేసుకున్నారు. స్వయం పరిపాలన ఆరంభమైనట్లు చెప్పుకొన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు, ఇప్పుడు కీలక పట్టణాలు, నగరాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

కాబుల్కు చేరువగా
ఆఫ్ఘన్ రాజధాని కాబుల్కు సుమారు 240 కిలోమీటర్ల దూరంలో ఉనన పుల్-ఐ-ఖుమ్రీ నగరం ప్రస్తుతం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లింది. బగ్లాన్ ప్రావిన్స్ రాజధాని ఇది. పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఫరా ప్రావిన్స్, బడక్షాన్ రాజధాని ఫైజాబాద్ను తాము వశం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఉత్తర, పశ్చిమ ప్రాంతంపై పైచేయి సాధించినట్టే కనిపిస్తోంది. కాబుల్కు అతి సమీపంలో ఉన్న ఖుమ్రీ నగరాన్ని సొంతం కావడం ఆ దేశ ప్రభుత్వ పెద్దలను ఆందోళనకు గురి చేస్తోంది. కాబుల్ను ఆ దేశ భద్రతా బలగాలు కాపాడుకోగలుగుతాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.

అమెరికా వైదొలగడంతో వారిదే పైచేయి..
మూడు వారాల కిందట అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుంది. ఎప్పుడైతే అమెరిక సైనిక బలగాలు వెనక్కి వెళ్లిపోయాయో.. అప్పటి నుంచే తాలిబన్ల విజృంభణ ఆరంభమైంది. ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ కాబుల్కు చేరువ అవుతున్నారు. ప్రభుత్వ బలగాలపై పైచేయి సాధిస్తున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఉత్తర ప్రాంతంలోని మూడు ప్రధాన నగరాలు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లాయంటే వారి దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగే అవకాశాలే అధికారంగా కనిపిస్తోన్నాయి.

ఆ నగరాల్లో భీకర ఘర్షణలు..
తమ దళాలు ఆ నగరాలన్నింటిని తిరిగి చేజిక్కించుకోవడానికి పోరాడుతున్నాయని అఫ్ఘన్ ప్రభుత్వం చెబుతోంది. పశ్చిమ ప్రాంతంలోని హెరాత్, దక్షిణాన ఉన్న కాందహార్, లష్కర్ గాహ్లో కూడా భీకరంగా పోరాడుతున్నట్లు పేర్కొంది. తాము కోల్పోయిన నగరాలన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి సమాయాత్తమౌతోన్నామని స్పష్టం చేసింది. అరాచక పాలనను అందించడానికి తాలిబన్లు చేస్తోన్న ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడతామనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. అదనపు బలగాలను మోహరింపజేస్తోన్నామని, పౌరులకు హాని కలగకుండా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తోన్నామని తెలిపింది.

షెబర్గాన్లో తాలిబన్ల పాలన..
ఉత్తర అఫ్గానిస్తాన్లోని జజ్ఝాన్ ప్రావిన్స్ రాజధాని షెబర్గాన్ను ఇదివరకే తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ తాలిబన్ల పాలన ఆరంభమైనట్లు కూడా తెలుస్తోంది. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న రెండో ప్రాంతీయ రాజధాని ఇది. అంతకుముందే- నిమ్రోజ్ ప్రావిన్స్ రాజధాని జరంజ్ను వారు ఆక్రమించారు. దేశవ్యాప్తంగా యుద్ధం తీవ్రమవుతుండడంతో ప్రభుత్వ భద్రతా దళాలకు దీనిని పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇక్కడి ప్రాంతీయ గవర్నర్ కార్యాలయాన్ని తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే, భీకర ఘర్షణల అనంతరం మళ్లీ భద్రతా బలగాలు ఈ ప్రాంతంపై పట్టు సాధించాయి.

రోజురోజుకూ దిగజారుతోన్న పరిస్థితులు
ఆఫ్ఘనిస్తాన్లో రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతోండటంతో ప్రధాన దేశాలు అప్రమత్తం అయ్యాయి. తమ దేశ పౌరులను వెనక్కి పిలిపించుకుంటోన్నాయి. భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆప్ఘనిస్తాన్లో నివసిస్తోన్న భారతీయులందరూ వెంటనే వెనక్కి వచ్చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. పలువురు భారతీయులు ఆఫ్ఘన్లో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తోన్నట్లు గుర్తించింది. కాంట్రాక్ట్ సంస్థల తరఫున అక్కడ పని చేయడానికి వెళ్లిన వారందరూ స్వదేశానికి చేరుకోవాలని సూచించింది. అమెరికా, బ్రిటన్ దేశాలు కూడా తమ పౌరులందరినీ వెనక్కి పిలిపించుకుంటోన్నాయి.
Recommended Video

బలగాల ఉపసంహరణతో..
అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తన దళాలను వెనక్కు తీసుకువెళ్లడం.. తాలిబన్ల విజృంభణకు ప్రధాన కారణమైంది. 18 సంవత్సరాలుగా అమెరికా ఆ దేశంలో మిలటరీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్ఖైదా ఉగ్రవాదుల భీకర దాడి అనంతరం.. అమెరికా ఆప్ఘనిస్తాన్పై యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. అప్పటిదాకా కొనసాగిన తాలిబన్ల పాలనకు చరమగీతం పాడింది అగ్రరాజ్యం. అప్పటి నుంచీ ఆఫ్ఘనిస్తాన్లో సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తోంది. తాలిబన్లు మళ్లీ పెట్రేగకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చింది. తాజాగా తన బలగాలను ఉపసంహరించడంతో ఊహించినట్టే తాలిబన్లు మళ్లీ రెచ్చిపోతోన్నారు.












Click it and Unblock the Notifications