ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం : శాంతి స్థాపన సాధ్యమేనా? సంయమనం పాటించాలని తాలిబన్లకు యూఎన్ చీఫ్ విజ్ఞప్తి !!
ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్ల చర్య ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ప్రపంచ దేశాల్లోనూ ఆందోళనకు కారణమైంది. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల రాజ్యానికి తెరదించి ఆదేశాన్ని పునర్నిర్మించడానికి ఈ రెండు దశాబ్దాలలో రెండు లక్షల కోట్ల డాలర్లను అమెరికా ఖర్చు చేసింది .2500 మంది అమెరికా సైనికులు మృత్యువాతపడ్డారు. చివరకు ఇంతాచేసి అమెరికా దళాలను ఉపసంహరించుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ వశమైంది. ప్రస్తుతం ఈ పాపం అమెరికాదేనని సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , జో బిడెన్ ను టార్గెట్ చేస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరెస్
కర్కశ చట్టాలు, కఠిన నిబంధనలతో మానవ హక్కులను హరించే తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ దేశం ప్రస్తుతం చిక్కుకుంది. ఆఫ్గన్ తాలిబన్లకు వశమైన నేపథ్యంలో స్థానిక పౌరుల జీవనం, వారి హక్కుల విషయంలో ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరెస్ ఈ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు. సంయమనం పాటించాలని తాలిబన్లను కోరారు. ప్రపంచ దేశాలు ఆప్ఘన్ పౌరుల హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సోమవారం (ఆగస్టు 16, 2021) ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై తాను తీవ్ర ఆందోళన చెందుతున్నానని, తాలిబాన్లు అత్యంత సంయమనం పాటించాలని కోరారు.

శాంతియుత పరిష్కారానికి సహకరించాలని తాలిబన్లకు విజ్ఞప్తి
ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి గురించి తాము తీవ్ర ఆందోళన చెందుతున్నాము మరియు ప్రాణాలను కాపాడటానికి మరియు మానవుల అవసరాలను తీర్చడానికి తాలిబన్ మరియు ఇతరులందరూ అత్యంత సంయమనం పాటించాలని తాము కోరుతున్నామని తెలిపారు. శాంతియుత పరిష్కారానికి సహకరించడానికి, అన్ని ఆఫ్ఘన్ ప్రజల మానవ హక్కులను కాపాడడానికి యూఎన్ నిశ్చయించుకుందని గుటెర్రెస్ చెప్పారు. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల నివేదికల మధ్య ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం చోటు చేసుకున్న వివాదం లక్షలాది మందిని పారిపోవడానికి ప్రేరేపిస్తోంది అని ఆయన అన్నారు.

ఆఫ్ఘనిస్థాన్ లో తాజా పరిణామాల నేపధ్యంలో యూఎన్ చీఫ్ ప్రకటన
తాలిబన్లు అన్ని దుర్వినియోగాలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మానవతా చట్టం మరియు మానవ హక్కులు, ముఖ్యంగా మహిళలు మరియు బాలికలు కష్టపడి సాధించిన ఫలాలను కాపాడాలని యునైటెడ్ నేషన్స్ చీఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంటోనియో గుటెర్రెస్ ఆఫ్ఘనిస్తాన్ పై యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ బహిరంగ సమావేశంలో కూడా ప్రసంగిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ఆదివారం తాలిబన్ల చేతిలో పడిపోవడం మరియు అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆఫ్ఘనిస్తాన్ దేశం నుండి పారిపోవడం మధ్య యునైటెడ్ నేషన్స్ చీఫ్ నుండి ప్రకటన వచ్చింది.

తమ పాలనలోని ఆఫ్ఘనిస్థాన్ తిరిగి వశం చేసుకుంటే ఆందోళన దేనికి అంటున్న తాలిబన్లు
ఇక ఐక్యరాజ్య సమితి చీఫ్ చేసిన వ్యాఖ్యలపై తాలిబన్లకు అనుకూల వర్గం మండిపడుతుంది. ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తుంది. గతంలో తాలిబన్లు పరిపాలించిన ఆఫ్ఘనిస్తాన్ తిరిగి వారు హస్తగతం చేసుకోవడంలో తప్పేంటని, ఇందులో ఆందోళన చెందాల్సిన విషయమేమిటని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా నాటో దేశాలతో విభేదించి ఆయా దేశాల పౌరులపై బాంబు దాడులకు పాల్పడిన పుడు మీరు ఎందుకు ఆందోళన చెందలేదంటూ యునైటెడ్ నేషన్స్ ను ప్రశ్నిస్తున్నారు.
Recommended Video

యూఎన్ పాత్ర కీలకం అని భావిస్తున్న ప్రపంచం .. శాంతి స్థాపన కోసం ప్రపంచం చూపు యూఎన్ వైపు
ఆఫ్ఘనిస్థాన్ లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుండి ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో యునైటెడ్ నేషన్స్ పాత్రపై కూడా అసహనం వ్యక్తం అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ లో చోటుచేసుకున్న సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి తీసుకోవలసిన నిర్ణయాలపై ఎదురుచూస్తున్నారు. మానవ హక్కుల రక్షణ సంక్షోభంలో పడిన సమయంలో కేవలం సంయమనం పాటించాలని సూచిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో ప్రజల రక్షణ కు భరోసా కల్పించేలా యునైటెడ్ నేషన్స్ స్పందించాలని కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో శాంతి స్థాపన సాధ్యమేనా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications