Afghanistan: తాలిబన్లకు జీ7 దేశాల కొత్త టాస్క్..కాదంటే బాయ్కాట్
లండన్: ఆఫ్ఘనిస్తాన్లో తలెత్తిన పరిణామాలు ప్రపంచ దేశాలను ఉలికిపాటుకు గురి చేస్తోన్నాయి.. కలవరపెడుతోన్నాయి. ఆ దేశంలో తాలిబన్లు మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోన్న ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదం మళ్లీ రెక్కలు విప్పుతుందోనే ఆందోళన అన్ని దేశాధినేతల్లోనూ వ్యక్తమౌతోన్నాయి. ఆఫ్ఘనిస్తాన్.. మళ్లీ ఉగ్రవాదులకు షెల్టర్ జోన్లా మారే అవకాశాలు లేకపోలేదనే అంచనా నెలకొన్నాయి. అదే సమయంలో- అక్కడి ప్రజల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు భంగం వాటిల్లడం ఖాయమని భావిస్తోన్నాయి.

జో బైడెన్ ఫోన్ కాల్తో జీ7 భేటీ
కొద్దిరోజుల కిందటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తన మిత్రదేశం బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్కు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల గురించి ఆయన ఈ సందర్భంగా బోరిస్ జాన్సన్తో సుదీర్ఘంగా చర్చించారు. ఆప్ఘన్ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత.. ఈ అంశంపై ఓ రెండు దేశాధినేతల మధ్య టెలిఫోనిక్ సంభాషణ చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. తాలిబన్ల వ్యవహారంలో ప్రజాస్వామిక దేశాలతో కూటమిగా ఏర్పడటం, సమష్ఠి నిర్ణయాలను తీసుకోవడం వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. వెంటనే జీ7 కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జో బైడెన్ కోరారు.

గడువు కంటే ముందే..
ఈ నేపథ్యంలో జీ7 సమ్మిట్ను నిర్వహించాలని జో బైడెన్ ప్రస్తావించగా.. దానికి బోరిస్ జాన్సన్ అంగీకరించారు. వచ్చేవారం జీ7 దేశాధినేతలు వర్చువల్గా భేటీ కావాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్ వెల్లడించింది. ఇంకా గడువు ఉండగానే ఈ సమావేశం ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆప్ఘనిస్తాన్ పరిణామాలు ప్రపంచ దేశాలను ఏ స్థాయిలో కలవరపెడుతోన్నాయనడానికి ఉదాహరణగా నిలిచింది.

తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడక ముందే..
నాలుగైదు రోజుల్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉన్నందు వల్ల- అంతకంటే ముందే తాము సమావేశం కావాల్సి ఉంటుందని జీ7 దేశాల విదేశాంగ మంత్రులు అభిప్రాయపడ్డారు. తాలిబన్ల సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే- తాము చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టం చేయాలనే కారణంతో వచ్చే వారం ఏర్పాటు కావాల్సిన ఈ సమావేశాన్ని ముందుకు జరిపారు. ఇక తాము చెప్పదలచుకున్నది చెప్పేశారు. దీన్ని తాలిబన్లు ఎంతవరకు పాటిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

జీ7 భేటీ..
ఆఫ్ఘన్లో తలెత్తిన అల్లకల్లోల పరిస్థితులు.. తాలిబన్ల పాలన పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనకు అద్దం పడుతోన్నాయి. ఈ నేపథ్యంలో- జీ7 దేశాలు సమావేశమయ్యాయి. జీ7 కూటమి దేశాలు- అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ విదేశాంగ శాఖ మంత్రులు పాల్గొన్నారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ ఈ భేటీకి సారథ్యాన్ని వహించారు. ఉగ్రవాదం సహా సంక్షోభ పరిస్థితుల నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఒడ్డెక్కించడంపై ప్రధానంగా చర్చించారు.

ప్రజలకు ప్రాణాలకు రక్ష..
ఆ దేశ ప్రజలకు సంపూర్ణ రక్షణ కల్పించడం, స్వేచ్ఛాయుత జీవనాన్ని గడిపేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై చర్చించాయి. అన్నింటికీ మించి ఉగ్రవాదాన్ని, దానితో సంబంధం ఉన్న ఏ సంస్థను కూడా ప్రోత్సహించకుండా ఉండేలా.. తాలిబన్లు తమ పరిపాలనను సాగించాల్సి ఉంటుందని జీ7 దేశాల మంత్రులు సూచిస్తోన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి, పోషించబోమనే హామీని కూడా తాలిబన్లు అంతర్జాతీయ సమాజానికి ఇవ్వాల్సి ఉంటుందనీ చెబుతున్నారు.

విదేశీయుల తరలింపును అడ్డుకోవద్దంటూ..
ఆఫ్ఘనిస్తాన్లో భయాందోళనల మధ్య జీవిస్తోన్న వేర్వేరు దేశాలకు చెందిన పౌరులను సురక్షతంగా తరలించడానికి తాలిబన్లు అడ్డుపడకూడదని డొమినిక్ రాబ్ సూచించారు. వేలాదిమంది విదేశీయులు ఆప్ఘన్లో ప్రతికూల పరిస్థితుల మధ్య జీవిస్తోన్నారని, వారందరినీ వెనక్కి తీసుకుని రావడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటోన్నాయని ఆయన అన్నారు. తరలింపు చర్యలను అడ్డుకోవడం సహేతుకం కాదని చెప్పారు. విదేశీయుల తరలింపు సజావుగా సాగడానికి సహకరించాలని సూచించారు.

ఆఫ్ఘన్ అస్థిరత్వం ఏ దేశానికీ మంచిది కాదు.
ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న రాజకీయ, సామాజిక అస్థిరత ఏ దేశానికి కూడా మంచిది కాదని జీ7 దేశాల మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి- పొరుగు దేశాలు, భారత ఉపఖండంపై దీని దుష్ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. దీన్ని నివారించడానికి తక్షణ చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందే- తాలిబన్లకు దూకుడుకు కళ్లెం వేయాల్సి ఉందని, ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి చొరవ చూపించాలని కోరాయి.

చెప్పింది చేయకపోతే.. బాయ్కాట్ చేస్తారా?
ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లు తాము కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంపై కఠిన ఆంక్షలను విధించే అవకాశాలను జీ7 దేశాలు పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. తాలిబన్ల ఆధీనంలో ఉన్నంత కాలం ఆఫ్ఘనిస్తాన్ను శతృదేశంగానే పరిగణించాల్సి ఉంటుందని, అంతర్జాతీయ సమాజం నుంచి బాయ్కాట్ చేయాల డిమాండ్ను వినిపించాలని ఆయా దేశాల విదేశాంగ మంత్రులు భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆఫ్ఘన్ పౌరుల మానవ హక్కులకు భంగం కలిగించకుండా ఈ చర్యలు ఉండాలని అభిప్రాయపడుతున్నాయి.
Recommended Video

రెఫ్యూజీల సంక్షేమానికి ప్రాధాన్యత..
తాలిబన్ల పరిపాలనను భయపడి దేశం విడిచి వెళ్తోన్న ఆప్ఘనిస్తానీయుల అంశం కూడా జీ7 కూటమి దేశాల మంత్రుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. దేశం విడిచి వెళ్తోన్న వారికి ప్రపంచ దేశాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని, వారికి నివాసం కల్పించాలని పేర్కొన్నారు. తాలిబన్ల ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయంపై ఒక స్పష్టతను సాధించడానికి, తమతో కలిసి వచ్చే దేశాలతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలపై చర్చించారు.












Click it and Unblock the Notifications