Afghanistan: ప్రపంచ దేశాలకు భారత్ సారథ్యం: కేంద్రమంత్రి జైశంకర్కు అమెరికా ఫోన్ కాల్
న్యూయార్క్: ఆఫ్ఘనిస్తాన్లో తలెత్తిన తాజా పరిణామాలపై భారత్ అప్రమత్తంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. కార్యాచరణ లోకి దిగింది. తాలిబన్లు ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వంపై ప్రపంచ దేశాలన్నిటి నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్న నేపథ్యంలో- వాటికి నాయకత్వాన్ని వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇదివరకట్లాగే తాలిబన్ ప్రభుత్వానికి కళ్లెం వేసేలా.. అష్టదిగ్బంధనం చేసేలా భారత్ చర్యలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
Viral video: గగుర్పాటు కలిగించే ఫుటేజ్: యూఎస్ విమానం నుంచి జారిపడ్డ ఆప్ఘనిస్తానీయులు
సుబ్రహ్మణ్యం జైశంకర్కు ఆంటోని
ఈ పరిణామాల మధ్య విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు అగ్రరాజ్యం అమెరికా కౌంటర్ పార్ట్ ఆంటోని జె బ్లింకెన్ ఫోన్ చేశారు. ఆప్ఘనిస్తాన్ అంశం వారి మధ్య చర్చకు వచ్చింది. తాలిబన్లు ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వం తీరు తెన్నులు, పాలన ఎలా ఉంటుందనేది ఇదివరకే ఒకసారి ప్రపంచ దేశాలన్నీ చూశాయి. ఆఫ్గన్ ప్రజలపై తాలిబన్ ప్రభుత్వం విధించే ఆంక్షలు కనివినీ ఎరుగని రీతలో ఉంటాయనేది స్పష్టమైంది. అదే తరహా పాలన మళ్లీ ఆరంభం కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.
ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా..
తాలిబన్ల పరిపాలనలో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా మారుతుందనే ఆందోళనలు ప్రపంచ దేశాధినేతల్లో నెలకొని ఉన్నయి. ప్రపంచం మొత్తాన్నీ గజగజమంటూ వణికించిన అమెరికా న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై విమానాలతో దాడి చేసిన అల్-ఖైదా.. ఆప్ఘనిస్తాన్లోనే దానికి మాస్టర్ ప్లాన్ రచించిన విషయం తెలిసిందే. మళ్లీ అలాంటి పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్లో నెలకొంటాయనే అనుమానాలు, ఆందోళనలు ప్రపంచ దేశాల్లో వ్యక్తమౌతోన్నాయి.
మొగ్గలోనే తుంచేసేలా..
మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా తాలిబన్ల ప్రభుత్వంపై కఠిన ఆంక్షలను విధించాల్సి ఉంటుందని వివిధ దేశాధినేతలు అభిప్రాయం పడుతున్నారు. ఉగ్రవాదం, ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించేలా తాలిబన్ల కొత్త ప్రభుత్వానికి ఎలాంటి అవకాశమే ఇవ్వకుండా ఉండేలా చేయాలనే వాదనలు వినిపిస్తోన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు బలపడితే- ఏ దేశానికి కూడా అది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు. ఉగ్రవాద ప్రభావం అన్ని దేశాలపైనా కనిపిస్తుందని అంటున్నారు.
న్యూయార్క్లో
ఈ క్రమంలో- విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశానికి ఆయన సారథ్యాన్ని వహించాల్సి ఉంది. ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ, టెర్రరిజం అంశాలపై మాట్లాడనున్నారు. ఆప్ఘనిస్తాన్లో నెలకొన్న తాజా పరిస్థితులపై భద్రతా మండలి సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి సుబ్రహ్మణ్యం జైశంకర్ న్యూయార్క్కు వెళ్లారు. ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఆయనకు స్వాగతం పలికారు.
ఆ టెలిఫోనిక్ సంభాషణ సారాంశం ఇదే..
కాగా- సుబ్రహ్మణ్యం జైశంకర్, ఆంటోని బ్లింకెన్ మధ్య ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ అంశమే చర్చకు వచ్చింది. రాజధాని కాబుల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలనే విషయంపై చర్చించారు. కాబుల్ ఎయిర్ పోర్ట్ను మూసివేయడం వల్ల పలు ఆయా దేశాలు.. తమ పౌరులను తరలించలేకపోతోన్నాయని పేర్కొన్నారు. కాబుల్ విమానాశ్రయాన్ని తెరిపించే విషయంపై అమెరికా చేస్తోన్న ప్రయత్నాలను సుబ్రహ్మణ్యం జైశంకర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అమెరికాను అభినందించారు. ఎంత త్వరగా కాబుల్ ఎయిర్పోర్ట్ను పునరుద్ధరించగలిగితే పౌరులకు అంత మేలు కలుగుతుందని అన్నారు. సైనిక విమానాలకు మినహా.. ఇతర ఎయిర్ క్రాఫ్ట్కు వాయు మార్గాన్ని మూసివేయడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి చర్చించారు.