‘మా పార్లమెంటుపై దాడిలో పాక్ అధికారి ప్రమేయం’
కాబూల్: తమ దేశ పార్లమెంటుపై తాలిబన్లు చేసిన దాడిలో పాకిస్థాన్ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారి ప్రమేయముందని ఆఫ్ఘనిస్థాన్ ఆరోపించింది. అఫ్గాన్ అధికార ప్రతినిధి హస్సిబ్ సిద్ధిఖి మాట్లాడుతూ.. పార్లమెంటుపై తాలిబన్లు జరిపిన దాడిలో పాకిస్థాన్ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారి ప్రమేయం ఉందని తెలిపారు.
అయితే అతని పేరు వెల్లడించేందుకు సిద్ధిఖి సుముఖత వ్యక్తం చేయలేదు. పార్లమెంటుపై దాడి జరుగుతుందని నిఘా సంస్థకు జూన్ 10న సమాచారం అందిందని తెలిపారు. అందుకే ఆ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని అని చెప్పారు.
సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఉపయోగించిన కారు బాంబు పాకిస్థాన్లోని పెషావర్లో తయారైందని ఆయన తెలిపారు. కాగా, ఈ వ్యాఖ్యలకు పాక్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.
నాలుగు రోజుల క్రితం తాలిబన్ ఉగ్రవాదులు అఫ్గాన్ పార్లమెంటుపై దాడి చేసి ఇద్దరు పౌరులను బలి తీసుకున్న విషయం తెలిసిందే. అఫ్గాన్ భద్రతా దళాలు జరిపిన ఎదురు దాడిలో దాడికి పాల్పడిన ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందారు.