చివరికి భూటాన్ కూడా భారత్కు షాకిచ్చింది.. నదీజలాల నిలిపివేత.. అస్సాం రైతుల ఆందోళన.. అన్నిదిక్కులా..
సరిహద్దులో చైనా దురాగతాలు, హత్యాకాండ మరువక ముందే.. ప్రపంచంలో ఏకైక హిందూదేశమైన నేపాల్ సైతం భారత్ తో కయ్యానికి దిగింది. శ్రీలంకను ఇప్పటికే బుట్టలో వేసుకున్న డ్రాగన్.. భారీగా సుంకాలను రద్దు చేసి బాంగ్లాదేశ్ ను కూడా దువ్వుతున్నది. మరోవైపు దాయాది పాకిస్తాన్ అన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టే పనిని ముమ్మరం చేసింది. ఇవి చాలవన్నట్లు చివరికి భూటాన్ కూడా భారత్ కు షాకిచ్చింది.
Recommended Video

కలదన్ జలాల నిలిపివేత..
సిక్కిం నుంచి మయన్మార్ వరకు ప్రవహించే కలదన్ నది.. భారత్-భూటాన్ సరిహద్దు గుండా అనేక మలుపులు తిరుగుతూ వెళుతుంది. అసోంలోని సిక్రి జిల్లాలో భూటాన్ సరిహద్దుకు సమీపంగా ఉన్న పదులకొద్దీ గ్రామాలకు ఆ నీరే ఆధారం. నిజానికి కలదన్ జలాలపై భూటాన్ కు ఎలాంటి హక్కులు లేకున్నా.. ఆ దేశంతో మనకున్న స్నేహబంధం రీత్యా ఊళ్లకు నీళ్లు మళ్లించే చానెల్ వ్యవస్థను వాళ్ల భూభాగంలో ఏర్పాటు చేసుకున్నాం. గడిచిన 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా.. కనీసం మాటైనా చెప్పకుండా భూటాన్ జలప్రవాహాన్ని నిలిపేసింది.

కరోనా సాకుతో డ్రామాలు..
సిక్రీ జిల్లాలో భూటాన్ సరిహద్దుకు సమీపంగా ఉన్న దాదాపు 30 గ్రామాల్లో 6వేల మందికిపైగా రైతులు కలదన్ జలాలపైనే ఆధారపడి సాగు చేస్తుంటారు. 1953లో అప్పటి రైతులే స్వయంగా చానెళ్లను నిర్మించుకున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే, రైతుల బృందాలు ఎలాంటి అనుమతుల అవసరం లేకుండానే భూటాన్ వైపున్న గేట్లను ఎత్తేసి, పనులు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ సాకుతో మన రైతుల్ని భూటాన్ బలగాలు లోనికి అనుమతించడంలేదు. పోనీ మీరైనా గేట్లు తెరవండని రైతులు కోరగా అందుకు కూడా భూటాన్ బలగాలు నిరాకరించాయి.

మోదీ సర్కార్ జోక్యం కోరుతూ..
దశాబ్దాలుగా కలదన్ నదీ జలాలనే నమ్ముకుని వ్యవసాయం చేస్తోన్న తమకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని సిక్రీ జిల్లా రైతులు వాపోతున్నారు. నీటి అడ్డగింతలో భూటాన్ తీరుకు వ్యతిరేకంగా దాదాపు 30 గ్రామాల రైతులు జిల్లా కేంద్రంలో బుధవారం భారీ నిరసన చేపట్టారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వెంటనే ఈ అంశంపై దృష్టిపెట్టాలని, భూటాన్ పాలకులతో మాట్లాడి నీళ్లు విడుదల చేయించాలని రైతులు డిమాండ్ చేశారు.

భూటాన్ ఎందుకిలా?
చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ తో భారత్ సంబంధాలు తరచూ మారుతూ వచ్చినా.. భూటాన్ మాత్రం మొదటి నుంచీ మనకు నమ్మకమైన మిత్రురాలిగానే కొనసాగింది. బ్రిటన్ మాదిరిగా ప్రజాస్వామ్య రాచరిక దేశమైన భూటాన్ కు చైనా, టిబెట్ సరిహద్దులుగా ఉన్నప్పటికీ ఇండియాతోనే దగ్గరి సంబంధాలు నెరిపింది. రాజు నాంగ్యాల్ వాంగ్ఛుక్ తరచూ ఇక్కడికి వస్తుండటం తెలిసిందే. కాగా, నదీ జలాల అడ్డగింత కింది స్థాయి అధికారుల పనా? లేక పై నుంచి ఆదేశాలు వచ్చాయా? అన్నది వెల్లడికావాల్సి ఉంది. ఒకవేళ నేపాల్ మాదిరి భూటాన్ కూడా భారత్ పై కయ్యానికి దిగితే పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications