అమెరికాలో మరో కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది: ఎఫ్డీఏ గ్రీన్ సిగ్నల్: మొన్న ఫైజర్..ఇప్పుడు ఇదే
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి మొన్నటికి మొన్న ఫైజర్ను సాధారణ ప్రజల వినియోగానికి తీసుకొచ్చిన అమెరికా.. ఇప్పుడు మరో వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి అవసరమైన అనుమతులను ఆ దేశ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ (ఎఫ్డీఏ) జారీ చేసింది. ఈ నెల 11వ తేదీన ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి ఎఫ్డీఏ ఆమోదం తెలపగా..సరిగ్గా వారం రోజుల్లో రెండో టీకాను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. నాలుగైదు రోజుల్లో దీని వినియోగం అమెరికా వ్యాప్తంగా ప్రారంభించబోతోంది.
ఎఫ్డీఏ ఓటింగ్ ఇలా..
అమెరికా ప్రభుత్వం తాజాగా సాధారణ వినియోగానికి అనుమతి ఇచ్చిన వ్యాక్సిన్.. మోడెర్నా. మోడెర్నా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్కు ఎఫ్డీఏ కొద్దిసేపటి కిందటే అనుమతి ఇచ్చింది. దీనికోసం ఏర్పాటైన నిపుణులతో కూడిన ప్యానెల్.. ఈ వ్యాక్సిన్కు అనుకూలంగా ఓటు వేసింది. మొత్తం 21 మందితో కూడిన ఈ ప్యానెల్లో 20 మంది మోడెర్నా వినియోగానికి అనుకూలంగా ఓటు వేశారు. ఒక్క ఓటు పరిశీలనలో ఉంచారు. ఇదివరకు ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి నిర్వహించిన ఓటింగ్లో 17 మంది అనుకూలంగా.. ముగ్గురు ప్రతికూలంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా నిపుణులందరూ మోడెర్నా వినియోగానికి మొగ్గు చూపారు.
మోడెర్నాను అనుమతిచ్చిన తొలిదేశంగా..
మోడెర్నా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను సాధారణ వినియోగానికి తీసుకొచ్చిన తొలి దేశం..అమెరికా. ఇప్పటిదాకా ఏ దేశం కూడా మోడెర్నా వ్యాక్సిన్కు అనుమతి ఇవ్వలేదు. ఆ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన వివరాలను ఆయా చోట్ల పరిశీలన దశలో ఉన్నాయి. ఫైజర్ తరువాత సాధారణ ప్రజల కోసం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ ఇదే. మోడెర్నా కోసం ఇదివరకు ఫైజర్ వ్యాక్సిన్ సరఫరా కోసం రూపొందించిన రవాణా వ్యూహాలనే అనుసరించనుంది. తొలి ప్రాధాన్యతగా 70 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల కరోనా పేషెంట్లకు వ్యాక్సిన్ను ఇంజెక్ట్ చేస్తారు.
వ్యాక్సిన్ వినియోగం వల్ల..
మోడెర్నా వ్యాక్సిన్ వినియోగం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని నిర్ధారణకు వచ్చామని, ఆ సంస్థ అందించిన మెడికల్ డేటా, క్లినికల్ ట్రయల్స్ వివరాలను క్షుణ్నంగా అధ్యయనం చేశామని యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ ఎపిడెమాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్నాల్డ్ మోంటో తెలిపారు. ఈ నిపుణుల ప్యానెల్కు ఆయనే నేతృత్వాన్ని వహించారు. ట్రయల్స్ దశలో వలంటీర్లకు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన విషయం తమ దృష్టిలో ఉందని, దాన్ని అధిగమించేలా వ్యాక్సిన్ ఫార్ములాను మోడెర్నా సంస్థ అభివృద్ధి చేసిందని ప్యానెల్ కమిటీ సభ్యుడు, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీవెన్ పెర్గమ్ తెలిపారు.
వారం రోజుల్లో పూర్తిస్థాయి అనుమతులు..
మోడెర్నా వ్యాక్సిన్ రవాణా కోసం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు అమెరికా వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నాలుగైదు రోజుల్లో వినియోగాన్ని చేపడతామని తెలిపింది. వ్యాక్సిన్ ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజీ కోసం అవసరమైన రూట్ మ్యాప్, బ్లూప్రింట్ సిద్ధంగా ఉన్నాయని, ఇదివరకు ఫైజర్ కోసం రవాణా కోసం రూపొందించిన వ్యూహాలనే అమలు చేస్తామని పేర్కొంది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ల ఫలితాలు త్వరలో అందుతాయని ఆశిస్తున్నట్లు అభిప్రాయపడింది.
Recommended Video
3,17,665 మంది బలి..
అమెరికాలో కరోనా వైరస్ తన కల్లోలాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఒకే రోజు 3,014 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇప్పటిదాకా 3,17,665 మంది బలి అయ్యారు. 1,76,18,802 కేసులు అక్కడ నమోదు అయ్యాయి. 2,23,014 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయంటే అమెరికాలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాలిఫోర్నియా-17,59,350, టెక్సాస్-15,52,362, ఫ్లోరిడా-11,68,483ల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. ఇల్లినాయిస్, న్యూయార్క్ల్లలో ఎనిమిది లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ అదే తీవ్రత కొనసాగుతోంది.