మొదలైన ట్రంప్ ఎఫెక్ట్.. ! రష్యాకు భారత్ బిగ్ షాక్..!
ఉక్రెయిన్ కు తాము ఎంత సాయం చేస్తున్నా చమురు అమ్మకాలతో ఆర్దికంగా బలంగా ఉన్న రష్యాను ఏం చేయలేమనే అంచనాకు వచ్చేసిన అమెరికా, పాశ్చాత్య దేశాల కూటమి ఆంక్షల కొరడా ఝళిపిస్తున్నాయి. ఓవైపు సుంకాలు, మరోవైపు ఆంక్షలతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్ని దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్ పై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు అదనపు జరిమానా కూడా విధించారు. దీంతో భారత్ ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది.
రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తుండటం, దానికి జాతి ప్రయోజనాల పేరు చెప్పుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంగా ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. పైకి రష్యాతో భారత్ ఏం చేసుకున్నా తనకు అవసరం లేదంటున్న ట్రంప్... లోలోపల మాత్రం ఈ విషయంలో రగిలిపోతున్నట్లు మార్కో రూబియో మాటల్ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొంటున్న భారతీయ రిఫైనరీలపై ఆంక్షలు మొదలయ్యాయి.

దీంతో ఎందుకొచ్చిన తంటా అనుకున్నాయో ఏమో భారతీయ చమురు కంపెనీలు వెనక్కి తగ్గాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపేశాయి. అయితే దీనిపై అధికారికంగా మాత్రం ఆయా కంపెనీలు కానీ కేంద్రం కానీ స్పందించడం లేదు. ఈ వారం ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఎంఆర్పీఎల్ వంటి చమురు సంస్థలు రష్యా ఆయిల్ కోరలేదని తెలుస్తోంది. కొంతకాలంగా నిరంతరాయంగా రష్యా చమురు కొనుగోలు చేస్తున్న ఆయా సంస్థలు ఇప్పుడు ట్రంప్ దెబ్బకు అబుదాబీకి చెందిన ముర్బన్ క్రూడ్, వెస్ట్ ఆఫ్రికన్ ఆయిల్ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్ తో రష్యా శాంతి ఒప్పందం చేసుకోకపోతే ఆ దేశం నుంచి చమురు కొంటున్న దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ గత వారం హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రష్యా చమురు సంస్థలపై పాశ్చాత్య దేశాల ఆంక్షల కొరడాతో ఆయా సంస్థలు కూడా 2022 తర్వాత ఎన్నడూ లేనంతగా రాయితీల్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. అటు ఈయూ కూడా ఆంక్షలు విధిస్తుండటంతో రష్యా చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది.












Click it and Unblock the Notifications