గగనతలంలో ఉల్లంఘనలు: వైట్హౌస్ ఖాళీకి ఆదేశాలు, అరగంటలో..
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీ ప్రాంత గగనతలంలో ఉల్లంఘనలు జరిగినట్లు సమాచారం రావడంతో యూనైటెడ్ స్టేట్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ మూసివేసినట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
గగనతలంలో ఉల్లంఘనల నేపథ్యంలో పలు యుద్ధ విమానాలు ఆ ప్రాంత గగనతలంలో విహరించాయి. ఈ క్రమంలో అమెరికా రాజధాని నగరంలోని కార్యాలయాలను ఖాళీ చేసినట్లు తెలిసింది. కాగా, మంగళవారం ఓ చిన్న విమానం నిషేధిత ప్రాంతంలో సంచరించిందని అధికారులు తెలిపారు.
ఆ విమానం గగనతల నిబంధనలను ఉల్లంఘించిందని వెల్లడించారు. కాగా, కేవలం అరగంటలోనే ఆ భవనాలను ఖాళీ చేయాలనే ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలో యూఎస్ సీక్రెట్ సర్వీస్ పర్సనల్స్.. సిబ్బంది స్థానంలో ఉండాలని సూచనలు వచ్చినట్లు సమాచారం.
మంగళవారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో క్యాపిటల్ పోలీసులు ఓ హెచ్చరికను జారీ చేసినట్లు తెలిసింది. వెంటనే కార్యాలయాల ఖాళీకి ఆదేశాలు జారీ అయ్యాయి. అరగంట తర్వాత మళ్లీ వారిని కార్యాలయాలకు అనుమతించడం జరిగిందని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.