పాకిస్తాన్పై అమెరికా నిప్పులు.. పద్దతి మార్చుకోవాలంటూ హెచ్చరిక
వాషింగ్టన్ : పాకిస్తాన్ తీరుపై అగ్రరాజ్యం అమెరికా నిప్పులు చెరిగింది. పద్దతి మార్చుకోవాలంటూ హెచ్చరించింది. తీరు మారకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. కశ్మీర్ ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు మృతి చెందిన ఘటనపై సీరియస్ గా స్పందించిన అమెరికా.. పాకిస్తాన్ కు మొట్టికాయలు వేసింది. ముష్కరులకు సహకారం అందించే విషయంలో పాకిస్తాన్ చూపిస్తున్న చొరవ సరికాదంటూ మండిపడింది.
ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఊతమివ్వడం సరికాదన్న అమెరికా.. ఆ మేరకు తీవ్రంగా తప్పుపట్టింది. టెర్రరిస్టులకు సపోర్ట్ ఇవ్వడం ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని సూచించింది. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉగ్రవాదులకు షెల్టర్ కల్పిస్తూ.. పాకిస్తాన్ వారికి స్వర్గధామంగా మారిందంటూ ఆగ్రహం వెలిబుచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా హింసను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు పనిచేస్తున్నారని మండిపడింది అగ్రరాజ్యం. ఉగ్రవాద మూలాలను అంతమొందించేందుకు భారత్ కు అన్నీ స్థాయిల్లో పూర్తి మద్దతిస్తామని ప్రకటించింది. ఉగ్రవాద నిర్మూలనకు భారత్ తో కలిసి పనిచేస్తామని తెలిపింది. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదుల చర్చను అమానవీయంగా పేర్కొంది రష్యా. టెర్రరిస్టుల అంతానికి ప్రపంచ దేశాలు ఏకతాటిపై నిలిచి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించాయి జర్మనీ, ఫ్రాన్స్.