భారత్-చైనా యుద్ధతంత్రం: ట్రంప్ బాంబు.. మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న అమెరికా.. అనూహ్య మలుపు..
భారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి యుద్ధ వాతావరణం నెలకొన్నవేళ.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందని, ఇప్పటికే తమ ప్రతిపాదనను భారత్, చైనాకు తెలియజేశానని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
Recommended Video

అసలేం జరుగుతోందంటే..
తూర్పు లదాక్ లోని దర్బూక్-షోయక్-దౌలత్ బేగ్ ఓల్డీ (డీబీఓ) మధ్య 255 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మాణం భారత్ గతేడాది పూర్తిచేసింది. దీనికి అనుసంధానం చేస్తూ అదనపు రహదారులు, వంతెనల నిర్మాణం ప్రారంభించింది. రోడ్డు నిర్మాణాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తోన్న చైనా.. కరోనా రాజకీయాలు మారిపోయిన దశలో.. గడిచిన 20 రోజులుగా భారతను నిలువరించేందుకు బలంగా ప్రయత్నిస్తున్నది. పలుమార్లు భారత సైన్యంతో నేరుగా తలపడింది. అంతటితో ఆగకుండా యుద్ధసన్నద్ధతను ప్రకటించింది. భారత్ మాత్రం ‘స్టేటస్ కో'కు పట్టుపడుతూనే, ఎదురుదాడికి సిద్ధమవుతోంది. ఈ టెన్షన్ నడుమ ట్రంప్ మధ్యవర్తిత్వం బాంబు పేల్చడంతో వ్యవహారం అనూహ్య మలుపు తిరిగినట్లయింది.

ట్రంప్ ఏమన్నారంటే..
‘‘భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం పెద్దదవుతున్నట్లు తెలిసింది. సమస్యను సామర్యంగా పరిష్కరించుకోవడంలో భాగంగా మధ్యవర్తిత్వం చేసేందుకు అమెరికా రెడీగా ఉంది. ఈ విషయాన్ని రెండు దేశాలకు తెలిజచేశాం. ధన్యవాదాలు'' అని ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్ ప్రకటనపై ఇటు భారత్ గానీ, అటు చైనాగానీ స్పందించాల్సి ఉంది. గతంలో కాశ్మీర్ వివాదంలోనూ ట్రంప్.. తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకురాగా.. భారత్ సున్నితంగా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

అమెరికా ఎత్తుగడ ఇదే..
ఇండో-చైనా బోర్డర్ వివాదంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తరచూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. స్వయంగా ప్రెసిడెంటే మధ్యవర్తిత్వం వహిస్తాననడం బహరంగంగా చెప్పడం ఇదే తొలిసారి. వారం రోజుల కిందటే.. ఇండో-చైనా వివాదంపై అమెరికా విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి, సౌత్, సెంట్రల్ ఏషియా వ్యవహారాల బ్యూరో చీఫ్ ఆలిస్ వేల్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా దూకుడుకు కళ్లెం వేయడానికే.. ఆసియాలో సారూప్య భావజాలం కలిగిన దేశాలతో అమెరికా కలిసి నడుస్తున్నదని, అమెరికా, జపాన్, ఇండియాతో కూడిన త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేశామని, ఇదే క్రమంలో మరిన్ని కూటములూ ఏర్పాటు చేస్తామని ఆలిస్ తెలిపారు. కూటమిలోని దేశాలతో తగువులు పెట్టుకోకుండా చైనాను నిలువరించేందుకు గట్టిగా ప్రయత్నిస్తామన్నారు.

భారత్-చైనా ఒప్పుకుంటాయా?
సరిహద్దు గొడవలో అమెరికా జోక్యంపై భారత్-చైనా ప్రస్తుతం ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికంగా మారింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి లదాక్ వరకు మొత్తం 3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నప్పటికీ.. భారత్-చైనాల మధ్య 1962 యుద్ధం తర్వాత ఒక్క తుపాకి తూటా కూడా పేలలేదు. అంటే, పాకిస్తాన్ సరిహద్దులోని పరిస్థితికి, చైనా బోర్డర్ కు చాలా తేడాఉంటుంది. పైగా, చైనాతో భారత్ ఆర్థిక సంబంధాలు కూడా పెద్దవే. వీటన్నింటి నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం రాత్రి జరిగిన హైలెవల్ మీటింగ్ లో కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. సాధ్యమైనంత వరకు లదాక్ లో స్టేటస్ కో కొనసాగేందుకు ప్రయత్నించాలని, అంతమాత్రాన డ్రాగన్ దేశానికి తలొగ్గేదిలేదని, దాని తిక్కను అణిచేయాల్సిందేనని మోదీ సైన్యాధికారులతో అన్నట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి భారత్.. ట్రంప్ అభ్యర్థనను అంగీకరించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ఎలాగూ ట్రంప్ మాటను వినేపరిస్థితిలో లేదు.

యుద్ధవాతావరణం..
ప్రస్తుతం భారత్-చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న తూర్పు లదాక్ ప్రాంతానికి కేవలం 200 కిలోమీటర్ల దూరంలో చైనా భారీ ఎయిర్ బేస్ ను సిద్ధం చేయడం, ఈ నెల 20 నాటికే ఆ ప్రాంతంలో అత్యాధునిక చైనీస్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు చేరుకోవడం, పాంగాంగ్ సరస్సుకు సమీపంలోని గాల్వాన్ లోయలో వందకుపైగా తాత్కాలిక గుడారాలను నిర్మించడం లాంటి చర్యలు చైనా యుద్ధ సన్నద్ధతను తెలియజేసేలా ఉన్నాయి. ఉద్రిక్తతలను మరింత పెంచుతూ బుధవారం బీజింగ్ నుంచి ‘‘దేనికైనా సిద్ధంగా ఉండండి..''అంటూ చైనా సైన్యానికి పిలుపురావడం పరిస్థితిని మరింత దిగజార్చింది. చైనాకు ధీటుగా భారత్ సైతం అంతే సంఖ్యలో సైన్యాలను సరిహద్దుకు తరలించింది. అయితే యుద్ధవిమానాలు, ఇతర వాహనాల తరలింపుపై స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications